ఆఫ్ఘనిస్థాన్ మసీదులో బాంబుదాడి.. 10 మంది మృతి
ABN , First Publish Date - 2022-04-22T00:25:03+05:30 IST
ఉత్తర ఆఫ్ఘనిస్థాన్లోని మజార్-ఇ-షరీఫ్లో ఓ మసీదుపై నేటి మధ్యాహ్నం జరిగిన బాంబు దాడిలో
కాబూల్: ఉత్తర ఆఫ్ఘనిస్థాన్లోని మజార్-ఇ-షరీఫ్లో ఓ మసీదుపై నేటి మధ్యాహ్నం జరిగిన బాంబు దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 65 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర ఆఫ్ఘనిస్థాన్లో షియా ముస్లిం మసీదుపై ఈ శక్తిమంతమైన బాంబు దాడి జరిగింది. కుందుజ్లో జరిగిన మరో ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. సై డోకెన్ మసీదు వద్ద ఈ పేలుడు సంభవించినట్టు అధికారులు తెలిపారు.
పేలుడు కారణంగా మసీదు ప్రాంతం భీతావహంగా మారింది. తెగిపడిన మాంసపు ముద్దలు చెల్లచెదురుగా పడ్డాయి. క్షతగాత్రులను అంబులెన్సులు, ప్రైవేటు కార్లలో ఆసుపత్రులకు తరలించారు. ఈ ఉదయం కాబూల్లో షియాలే లక్ష్యంగా రోడ్డు పక్కన అమర్చిన బాంబు పేలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఈ రెండు ఘటనలకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు.