నిస్సహాయులకు భరోసా
ABN , First Publish Date - 2022-01-17T05:06:33+05:30 IST
సంక్షేమ పథకాలతో సబ్బండ వర్గాలకు మేలు చేస్తున్న ప్రభుత్వం దివ్యాంగులు, వయో వృద్ధుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నది.
- దివ్యాంగులు, వృద్ధుల అభ్యున్నతికి సర్కారు పెద్దపీట
- ఉచిత ఉప కరణాలు, సహాయ పరికరాల పంపిణీ
- నెలనెల అందనున్న ఆసరా పింఛన్లు
- 17 నుంచి 25 వరకు ప్రత్యేక శిబిరాలు
కామారెడ్డి, జనవరి 16: సంక్షేమ పథకాలతో సబ్బండ వర్గాలకు మేలు చేస్తున్న ప్రభుత్వం దివ్యాంగులు, వయో వృద్ధుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆసరా పింఛన్లతో అండగా నిలుస్తోంది. ఉచిత ఉపకరణాలు, సహాయ పరికరాలను అందజేస్తూ చేయూతనందిస్తోంది. ఇందులో భాగంగా నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించింది. జిల్లాలోని ఆయా మండలాల్లో స్పెషల్ క్యాంపులను నిర్వహించి అర్హులైన దివ్యాంగులను గుర్తించి వారికి ఉపకరణాలు, సహాయ పరికరాలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆ దిశగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు వారి అవసరాలకు అనుగుణంగా పరికరాలు అందజేస్తున్నారు.
దివ్యాంగులకు, వయోవృద్ధులకు
దివ్యాంగులకు చేతికర్రలు, వినికిడి యంత్రాలు, ట్రైసైకిళ్లు, ఎంఎస్ఐడీ కిట్, కృత్రిమ అవయవాలు, బ్యాటరీ ఆపరేటివ్ మోటార్, ట్రైసైకిళ్లు అందించనున్నారు. 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు చేతి కర్రలు, వీల్చైర్స్, వాకర్స్, వాష్రూమ్ వీల్చైర్, నడుం పట్టి, మెడపట్టి, కళ్ల అద్దాలు, వినికిడి యంత్రాలు, ఫుట్కేర్ యూనిట్, వాకింగ్ స్టిక్ విత్ సెట్, కృత్రిమ దంతాలు, నీ-బ్రేస్, రోలేటర్ విత్బ్రేక్ వంటి పరికరాలు అందజేయనున్నారు.
తీసుకురావాల్సిన పత్రాలు
దివ్యాంగులు సదరం ధ్రువీకరణ పత్రం లేదా ఏదైన వైద్యుడు ఫిజీషియన్ ఇచ్చిన 40శాతం వైకల్యం మించినట్లు సర్టిఫికెట్, రేషన్కార్డు, ఆధార్కార్డు, రెండు పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలని అధికారులు పేర్కొంటున్నారు. ఇక వయోవృద్ధులు తహసీల్దార్ జారీ చేసిన ఆధాయ రఽధువీకరణ పత్రం, రేషన్కార్డు, ఒకవేళ అవి లేకుంటే నెలకు రూ.18వేల ఆదాయం మించలేదని సర్పంచ్, కౌన్సిలర్ ఇచే సర్టిఫికెట్లు, ఆధార్కార్డు, పింఛన్ ఐడీకార్డు, ఓటరు ఐడీ కార్డు వయస్సు నిర్ధారణ కోసం తీసుకురావాలి.
సద్వినియోగం చేసుకోవాలి
- సరస్వతీ, ఐసీడీఎస్ పీడీ, కామారెడ్డి
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏఎల్ఐఎంసీవో సంస్థ ఆధ్వర్యంలో ఏడీఐపీ పథకం ద్వారా దివ్యాంగులు, ఆర్వీవైస్కీం కింద వయో వృద్ధులకు ఉపకరణాలు, సహాయ పరికరాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు జిల్లాలోని పలుచోట్ల క్యాంపులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు సంబంధిత పత్రాలతో హాజరుకావాలి. అర్హతలేనివారు వచ్చి ఇబ్బందులు పడొద్దు.