మరిన్ని అప్పులకు లైన్‌క్లియర్‌!

ABN , First Publish Date - 2020-12-03T08:39:26+05:30 IST

వైసీపీ ప్రభుత్వం మరిన్ని అప్పులు తీసుకురావడానికి మార్గం సుగమం చేసుకుంది. ద్రవ్య నియంత్రణ-బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టానికి చేసిన సవరణలను అసెంబ్లీ బుధవారం ఆమోదించింది.

మరిన్ని అప్పులకు లైన్‌క్లియర్‌!

ఎఫ్‌ఆర్‌బీఎం 5 శాతానికి పెంపు.. బిల్లులకు శాసనసభ ఆమోదం

సంక్షేమ వనరుల కోసమే ఏపీఎస్‌డీసీ: ఆర్థిక మంత్రి బుగ్గన 

ఆదాయంపై దృష్టి పెట్టాలి: కేశవ్‌.. అప్పుచేసి పప్పు కూడు: బుచ్చయ్య


అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం మరిన్ని అప్పులు తీసుకురావడానికి మార్గం సుగమం చేసుకుంది. ద్రవ్య నియంత్రణ-బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టానికి చేసిన సవరణలను అసెంబ్లీ బుధవారం ఆమోదించింది. కరోనా కారణంగా రాష్ట్రప్రభుత్వాలు ఇబ్బందుల్లో ఉండడంతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎంను 2 శాతం పెంచుకునేందుకు అనుమతిచ్చిందని... మొత్తంగా ఎఫ్‌ఆర్‌బీఎంను 5 శాతానికి పెంచిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చర్చ సందర్భంగా తెలిపారు. రెవెన్యూ లోటును 2.5 శాతానికి పెంచేందుకు చట్టంలోని 9 ఏ, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 5 శాతానికి పెంచడానికి 9బీ, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 35 శాతం దాటకుండా సెక్షన్‌ ఏ(సీ)కి సవరణలు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. వీటిని ఆమోదించాలని సభను కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సడీసీ) బిల్లును కూడా సభలో పెట్టారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలు మన బడిలో నాడు-నాడు, ఆస్పత్రుల్లో నాడు-నేడు, వైఎ్‌సఆర్‌ చేయూత, వైఎ్‌సఆర్‌ ఆసరా, జగనన్న అమ్మఒడి, రైతు భరోసాకు ప్రత్యేక ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి దీనిని తెచ్చినట్లు తెలిపారు.


ఏయే బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు అందుతాయో ఎస్‌బీఐ కేపిటల్‌ సలహాలు, సూచనలు ఇస్తుందన్నారు. ఎక్సైజ్‌ నుంచి వచ్చే అదనపు ఆదాయాన్ని దీనికి ష్యూరిటీగా పెడుతున్నామని తెలిపారు. ఆ డబ్బులను కేవలం ఆరు పథకాలకే ఉపయోగించే విధంగా నిబంధనలు సిద్ధం చేశామన్నారు. దీనికి ప్రత్యేకంగా ఎస్ర్కో ఖాతా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ బిల్లులపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అభ్యంతరం తెలిపారు. ఆర్థిక మంత్రి చాలా తెలివిగా ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారని చెప్పారు. అప్పుల మీద కాకుండా ఆదాయం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ‘ఎఫ్‌ఆర్‌బీఎంను 2 శాతం అదనంగా పెంచుకోవడానికి కేంద్రం 4 నిబంధనలు పెట్టింది. దీనిని పక్క రాష్ట్రాలు తిరస్కరించాయి. మన ప్రభుత్వం కేంద్రం వద్ద తలొంచుకుని వస్తోంది. ప్రజలపై భారం వేయడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తోంది. భారీగా పీడీ అకౌంట్లు సృష్టించి తెచ్చిన అప్పులన్నీ ఆ ఖాతాల్లో వేసి ఖజానాలోకి వేసుకుంటోంది’ అని విమర్శించారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ.. అప్పులు చేసి పప్పు కూడు తింటున్నారని ఎద్దేవా చేశారు. బుగ్గన స్పందిస్తూ.. అన్ని రాష్ట్రాలూ ఎఫ్‌ఆర్‌బీఎం పెంపునకు ముందుకొచ్చాయన్నారు. అనంతరం సభ 2 బిల్లులనూ ఆమోదించింది.

 

టీడీపీ వాకౌట్‌...

సౌర విద్యుత్‌ ఒప్పందాలపై మొన్నటి వరకూ రాద్ధాంతం చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు అదే దారి పట్టిందని టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు సౌర విద్యుత్ల్‌పై మాట్లాడుతూ అన్నారు. బుగ్గన కల్పించుకుని.. దేశంలో ఎక్కడా లేని రేట్లకు టీడీపీ ప్రభుత్వం అగ్రిమెంట్‌ చేసుకుందని, దీని వల్ల ప్రజలపై రూ.2 వేల కోట్ల భారం పడుతుందని చెప్పారు. గతంలో 25 ఏళ్లకు పీపీపీలు కుదుర్చుకుంటే వైసీపీ గగ్గోలు పెట్టిందని.. ఇప్పుడు 30 ఏళ్లకు అగ్రిమెంట్‌ చేసుకుంటోందని అచ్చెన్న ఆక్షేపించారు. అసైన్డ్‌ భూములు మొత్తం దళితుల వద్ద ఉన్నాయని.. వాటిని బలవంతంగా లాక్కునే ఆలోచనలో ప్రభుత్వం ఉందని.. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ససేమిరా అనడంతో టీడీపీ వాకౌట్‌ చేసింది. 

Updated Date - 2020-12-03T08:39:26+05:30 IST