హత్యలు.. హత్యాయత్నాలు
ABN , First Publish Date - 2021-09-17T05:45:23+05:30 IST
వరుస హత్యలు, హత్యాయత్నాలు, దాడులతో నంద్యాల పట్టణంలో భయాందోళనలు నెలకొన్నాయి.
- వరుస ఘటనలతో భయాందోళనలు
- నంద్యాలలో పేట్రేగిపోతున్న రౌడీమూకలు
- పోలీసు యంత్రాంగం వైఫల్యాలపై విమర్శలు
నంద్యాల (నూనెపల్లె), సెప్టెంబరు 16: వరుస హత్యలు, హత్యాయత్నాలు, దాడులతో నంద్యాల పట్టణంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అని ప్రజలు వణికిపోతున్నారు. నానాటికీ అభివృద్ధి చెందుతున్న నంద్యాల పట్టణంలో అదే స్థాయిలో అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయి. రోజురోజుకూ శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. నేరస్థులను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు గుట్కా, మట్కా, పేకాటలకు పరిమితమైన అసాంఘిక శక్తులు క్రమంగా హత్యలు ప్రారంభించాయి. హత్యలు, హత్యాయత్నం కేసుల్లో జైలుకు వెళ్లికు వెళ్లినవారు బెయిల్పై బయటకు రాగానే ప్రత్యర్థులపై కత్తులు దూస్తున్నారు. ఈ క్రమంలోనే హత్యలు, హత్యాయత్నాల పరంపర కొనసాగుతోందని తెలుస్తోంది. నేరస్థుల కదలికలను పసిగట్టాల్సిన ఇంటెలిజెన్స్, కట్టడి చేయాల్సిన పోలీసు వ్యవస్థలు నిద్రావస్థలో ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.
నిత్యం ఏదో ఓ ఘటన
గత ఏడాది మార్చిలో నంద్యాల ఎన్జీవో కాలనీలో రౌడీషీటర్ రాజశేఖర్ (కర్నూలు, నంద్యాలలో జరిగిన డబుల్ మర్డర్ కేసుల్లో ముద్దాయి) నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు.
గత ఏడాది మేలో రైతునగరంలో ఓ మహిళ తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది.
గత ఏడాది అక్టోబరులో పొన్నాపురానికి చెందిన వైసీపీ నాయకుడు సుబ్బరాయుడు విజయ మిల్క్ డెయిరీ వెనుకభాగంలోని పొలాల్లో ప్రత్యర్థుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యాడు.
గత ఏడాది అక్టోబరులోనే వైఎస్ నగర్లో లక్ష్మీదేవి అనే గర్భిణి నడిరోడ్డుపై హత్యకు గురైంది.
ఈ ఏడాది జూన్లో వైఎస్ నగర్లో రౌడీషీటర్ సురేంద్ర అలియాస్ సూరి చేతిలో జగన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.
ఈ ఏడాది జూలైలో చాపిరేవుల గ్రామంలో భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది.
ఈ ఏడాది ఆగస్టులో ఎన్జీవో కాలనీలో యూ ట్యూబ్ విలేకరి కేశవ్ టూ టౌన్ కానిస్టేబుల్ వెంకటసుబ్బయ్య చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.
ఈ నెలలో నంద్యాల పట్టణ నడిబొడ్డున బాలాజీ కాంప్లెక్స్ ప్రాంతంలో వ్యాపారి తిరువీధి వెంకటసుబ్బయ్య ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు.
పాతకక్షల నేపథ్యంలో గత నెలలో నంద్యాల ఎన్జీవో కాలనీ మున్సిపల్ హైస్కూల్ ఎదురు సందులో ఇరువర్గాల యువకులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఓ వర్గానికి చెందిన విజయ్ అనే యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. దాడి చేసిన వర్గంపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ఈ నెలలో నంద్యాల సంజీవ నగర్ సెంటర్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో మిత్రులతో కలిసి మద్యం సేవిస్తున్న రౌడీషీటర్ వెంకటసాయి అలియాస్ కవ్వపై ప్రత్యర్థులు మొద్దు కత్తితో దాడి చేశారు.