బర్షశ్రీని చట్ట ప్రకారమే అరెస్ట్ చేశాం : Assam police
ABN , First Publish Date - 2022-07-14T22:40:51+05:30 IST
ఓ నిషిద్ద సంస్థకు మద్దతుగా ఫేస్బుక్ (Facebook) పోస్ట్ పెట్టిన బర్షశ్రీ
గువాహటి : ఓ నిషిద్ద సంస్థకు మద్దతుగా ఫేస్బుక్ (Facebook) పోస్ట్ పెట్టిన బర్షశ్రీ బురగొహెయిన్ (Barshashree Buragohain) (19)ను చట్ట ప్రకారమే అరెస్టు చేసినట్లు అస్సాం పోలీసులు (Assam Police) తెలిపారు. ఆమెను విడుదల చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుండటంతో పోలీసులు ఈ ప్రకటనను విడుదల చేశారు.
‘దేశానికి వ్యతిరేకంగా మళ్లీ తిరుగుబాటు చేస్తాం’ అంటూ ఫేస్బుక్ పోస్ట్ పెట్టినందుకు Barshashree Buragohainపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) ప్రకారం ఆరోపణలు నమోదు చేసి, మే 18న ఆమెను అరెస్టు చేసినట్లు అస్సాం పోలీసులు తెలిపారు. ఆమెను గోలాఘాట్ జిల్లాలోని ఉరియమ్ఘాట్లో అరెస్టు చేసినట్లు చెప్పారు.
శాంతి భద్రతల విభాగం ప్రత్యేక డీజీపీ జీపీ సింగ్ మాట్లాడుతూ, ఇది రాజద్రోహం కేసు కాదన్నారు. ఇది దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సంబంధించిన కేసు అని చెప్పారు. ఆమెపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Barshashree Buragohain జోర్హాట్లోని డీసీబీ కళాశాలలో చదువుతున్నారని, ఈ నెలలో పరీక్షలు జరుగుతాయని, అందువల్ల ఆమెను విడుదల చేయాలని ఆమె తల్లిదండ్రులు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు విజ్ఞప్తి చేశారు. ఆమెను విచారించవలసి ఉన్నందువల్ల ఆమెను ఇప్పట్లో విడుదల చేయడం సాధ్యం కాకపోవచ్చునని పోలీసులు చెప్తున్నారు.
అస్సాం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత ఇటీవల విలేకర్లతో మాట్లాడుతూ, పద్యం రాసినందుకు బర్షశ్రీని అరెస్టు చేయలేదని, నిషిద్ధ సంస్థలో చేరాలని ఇతరులను ప్రోత్సహించినందుకు ఆమెను అరెస్టు చేశామని చెప్పారు.