Himanta Biswa Sarma: ఎన్‌కౌంటర్లపై అస్సాం ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-07-16T01:14:02+05:30 IST

ఇటీవలి వరుస ఎన్‌కౌంటర్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి

Himanta Biswa Sarma: ఎన్‌కౌంటర్లపై అస్సాం ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

గువాహటి: అస్సాంలో ఇటీవలి వరుస ఎన్‌కౌంటర్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేడు (గురువారం) కీలక వ్యాఖ్యలు చేశారు. నేరస్థులపై చట్ట పరిధిలో పోరాడటానికి పోలీసులకు ‘పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ’ ఇచ్చినట్టు తెలిపారు.


రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరుస ఎన్‌కౌంటర్ల విషయాన్ని అసెంబ్లీ సమావేశాల జీరో అవర్‌లో ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా లేవనెత్తారు. స్పందించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఏ రూపంలో ఉన్నా నేరాలకు సభ వ్యతిరేకమన్న సందేశాన్ని పంపాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. 


‘‘సభానేతగా నేను అసోం పోలీసులను అభినందిస్తున్నాను. ముఖ్యంగా నా హయాంలో వారు బాగా పనిచేస్తున్నారు’’ అని సీఎం పేర్కొన్నారు. అయితే, అమాయకులను హింసించవద్దని డీజీపీని కోరుతున్నట్టు చెప్పారు. చట్ట పరిధిలో నేరస్థులపై పోరాడేంత వరకు పోలీసులకు పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ ఉంటుందని శర్మ స్పష్టం చేశారు. 


గత రెండు నెలల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మంది నేరగాళ్లు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారని, మరో 23 మంది గాయపడ్డారని సీఎం సభకు తెలిపారు. పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కుని వారిపై దాడికి పాల్పడడం, పారిపోవడానికి ప్రయత్నించిన సమయాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నట్టు చెప్పారు. 


రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనపై పూర్తి బాధ్యత ఉందన్న శర్మ.. గోవుల స్మగ్లింగ్‌, డ్రగ్స్ వ్యాపారం, మనుషుల అక్రమ రవాణా, మహిళలు, చిన్నారులపై నేరాలు వంటి వాటిని ఎంతమాత్రమూ సహించబోమన్నారు. అన్ని నేరాల్లోనూ చాలా కఠినంగా వ్యవహరిస్తామని, ఈ విషయంలో కులమతాలంటూ ఏవీ ఉండబోవని తేల్చి చెప్పారు. 

Updated Date - 2021-07-16T01:14:02+05:30 IST