ఇరు రాష్ట్రాల మధ్య యాభై ఏళ్లుగా నెలకొన్న సరిహద్దు వివాదానికి ముగింపు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాయి అసోం-మేఘాలయ. అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మాలు సరిహద్దు ఒప్పందంపై మంగళవారం సంతకం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. దీని ద్వారా 1972 నుంచి నెలకొన్న 884 కిలోమీటర్ల సరిహద్దు వివాదంలో ప్రధాన సమస్యలకి పరిష్కారం దొరికినట్లైంది. సరిహద్దుకు సంబంధించి 12 అంశాల్లో వివాదం నెలకొనగా, తాజా ఒప్పందంతో ఆరు అంశాలు పరిష్కారమయ్యాయి. అంటే 70 శాతం సరిహద్దు సమస్య ముగిసినట్లే. మిగతా 30 శాతం సరిహద్దుకు సంబంధించిన ఆరు అంశాలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. యాభై ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. దీంతో ఈ అంశంపై ఇరు రాష్ట్రాలు దృష్టిపెట్టాయి. తమకున్న అభ్యంతరాలు, పరిష్కారాలతో కూడిన డ్రాఫ్ట్ను హోం వ్యవహారాల శాఖకు అందజేశాయి. వీటిని పరిశీలించిన కేంద్రం ఇద్దరు సీఎంలతో చర్చించి, తగిన పరిష్కారాలు సూచించింది. దీంతో అసోం-మేఘాలయ సీఎంలు ఇద్దరూ తాజా ఒప్పందంపై సంతకాలు చేశారు.