Assamలో నేడూ భారీవర్షాలు...ఐఎండీ orange alert జారీ
ABN , First Publish Date - 2022-06-20T18:11:38+05:30 IST
అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో మృతుల సంఖ్య 71కి పెరిగింది....
71కు చేరిన మృతుల సంఖ్య
గౌహతి: అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో మృతుల సంఖ్య 71కి పెరిగింది.తాజాగా ముగ్గురు పిల్లలతో సహా మరో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక బులెటిన్ తెలిపింది. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు వ్యక్తులు మరణించారు.ఐదు జిల్లాల్లో మరో ఎనిమిది మంది గల్లంతైనట్లు అధికారులు చెప్పారు. దీంతో ఈ ఏడాది వరదలు, కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 71కి చేరింది. వరదల కారణంగా కనీసం 42,28,100 మంది ప్రభావితమయ్యారని బులెటిన్లో పేర్కొంది.
కాచర్, డిమా హసావో, గోల్పరా, హైలాకండి, కమ్రూప్ మెట్రోపాలిటన్, కరీంగంజ్లలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ సోమవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాగల 48 గంటల్లో ఉరుములు,మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అధికారులు వరద బాధితుల కోసం 27 జిల్లాల్లో 1,147 సహాయ శిబిరాలు నిర్వహిస్తున్నారు. పలు జిల్లాల్లో వరదల కారణంగా కట్టలు, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. జోర్హాట్లోని నీమతిఘాట్, తేజ్పూర్, గోల్పరా టౌన్, ధుబ్రి పట్టణాల్లో బ్రహ్మపుత్ర ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోందని అధికారులు చెప్పారు. దీని ఉపనదులు బెకి, మానస్, పగ్లాదియా, పుతిమరి, కోపిలి, సుబంసిరి కూడా ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.