వరదలతో అసోం అతలాకుతలం..

ABN , First Publish Date - 2022-05-22T07:46:46+05:30 IST

అసోంలోని రెండు గ్రామాల్లో 500కి పైగా కుటుంబాలకు రైలు పట్టాలే ఆవాసంగా మారాయి.

వరదలతో అసోం అతలాకుతలం..

5 రోజులుగా 500 కుటుంబాలకు రైలు పట్టాలే దిక్కు 

జమునాముఖ్‌, మే 21: అసోంలోని రెండు గ్రామాల్లో 500కి పైగా కుటుంబాలకు రైలు పట్టాలే ఆవాసంగా మారాయి. విపరీతంగా కురుస్తున్న వర్షాలతో ముంచెత్తుతున్న వరదలతో రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. జమునాముఖ్‌ జిల్లాలోని చంగ్జురాయ్‌, పాతియా పతార్‌ గ్రామస్థుల ఇళ్లు, సామా న్లు వరద నీటిలో కలిసిపోయాయి. దీంతో వాళ్లంతా రైలుపట్టాలపైకి చేరుకున్నారు. ఆయా గ్రామాల్లో ఎత్తుగా ఉన్న ప్రదేశం అదొక్కటే కావడంతో అక్కడే టార్పాలిన్‌ షీట్లను పైకప్పుగా ఏర్పాటు చేసుకొని తలదాచుకున్నారు. 3 రోజులు ఎలాంటి ఆవాసమూ లేకుండా పట్టాలపై ఉన్నామని.. తర్వాత టాల్పాలిన్లు కట్టుకున్నామన్నారు. 


ఆహారం, తాగునీరు, ఆశ్రయంలేక ముప్పుతిప్పలు పడుతున్నా సహాయం అందలేదని ఆవేదన చెందారు. ఆహార పొట్లాలు కొందరికే అందుతున్నాయని, ఒకపూట తిండి కూడా దొరకడం లేదన్నారు. కాగా.. లోతట్టు ప్రాం తాల్లోకి ఉధృతంగా ప్రవహిస్తున్న వరద వల్ల 29 జిల్లాల్లోని 2,585 గ్రామాల్లో 8 లక్షల మందికిపైగా జనం ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. కొండచరియలు విరిగిపడి 14 మంది చనిపోయారు. ఆర్మీ, పారామిలిటరీ, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు 22వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయని.. 87వేల మందికి 343 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించామని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-05-22T07:46:46+05:30 IST