సరిహద్దు వివాదంపై సుప్రీంకి వెళతాం: అస్సాం సీఎం

ABN , First Publish Date - 2021-08-02T05:25:34+05:30 IST

మిజోరంతో నెలకొన్న సరిహద్దు వివాదంపై సుప్రీం కోర్టుకెక్కుతామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పారు. మిజోరంతో సరిహద్దు..

సరిహద్దు వివాదంపై సుప్రీంకి వెళతాం: అస్సాం సీఎం

మిజోరంతో నెలకొన్న సరిహద్దు వివాదంపై సుప్రీం కోర్టుకెక్కుతామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పారు. మిజోరంతో సరిహద్దు వద్ద ఇటీవల ఇరు రాష్ట్రాల పోలీసులకు మధ్య జరిగిన మారణకాండ నేపథ్యంలో అస్సాం సీఎంపై మిజోరం పోలీసులు అటెంప్ట్ టూ మర్డర్ కేసు నమోదు చేశారు. దీనిపై హిమంత బిశ్వాన్ మీడియాతో మాట్లాడారు. తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందంటే ఆనందంగా ఒప్పుకుంటానని, తాను ఏ పోలీస్ స్టేషన్‌కైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. అయితే తమ పోలీసులను విచారించేందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించనని చెప్పుకొచ్చారు. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు సుప్రీం కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు.


ఇదిలా ఉంటే అస్సాం, మిజోరం మధ్య సరిహద్దు వివాదం నేటిది కాదు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వలస పాలన నాటి నుంచే కొనసాగుతోంది. మొదటి సారి 1987లో కూడా ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత మళ్లీ ఈ మధ్య కాలంలో ఇరు రాష్ట్రాల మళ్లీ హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. అస్సాం-మిజోరం మధ్య 164.6 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అస్సాంలోని కచార్, మిజోరంలోని కొలాసిబ్ జిల్లాల మధ్య ఉన్న భూభాగమే ప్రస్తుత వివాదానికి ప్రధాన కారణం.


గతేడాది అక్టోబర్‌లో అస్సాం, మిజోరం ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ భూభాగం కోసం రెండుసార్లు తీవ్ర ఘర్షణలకు దిగారు. ఈ ఘర్షణల్లో అనేకమంది గాయపడ్డారు కూడా. అప్పటి నుంచి వివిధ కారణాలతో ఈ ప్రాంతంలో అనేక హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.

Updated Date - 2021-08-02T05:25:34+05:30 IST