బంగారం అడిగితే బతికే ఉందన్నారు
ABN , First Publish Date - 2021-05-07T10:02:42+05:30 IST
కొవిడ్ బాధితుల దయనీయ పరిస్థితులు హృదయాన్ని కలచివేస్తున్నాయి. బంగారం కోసమే తన తల్లిని చంపేశారేమోనని సందే హం వ్యక్తం చేస్తూ ఓ కరోనా బాధితురాలి కుమార్తె తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా
ఆస్పత్రిలో నా తల్లి నగలు మాయం చేసేందుకే
కొవిడ్ మృతురాలి కుమార్తె వీడియో
పలాస, మే 6: కొవిడ్ బాధితుల దయనీయ పరిస్థితులు హృదయాన్ని కలచివేస్తున్నాయి. బంగారం కోసమే తన తల్లిని చంపేశారేమోనని సందే హం వ్యక్తం చేస్తూ ఓ కరోనా బాధితురాలి కుమార్తె తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చనిపోయిన తన తల్లి బతికే ఉందని వైద్య సిబ్బంది చెప్పారని, తినడానికి ఏమైనా తీసుకురావాలన్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గకు చెందిన జయ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆమె తల్లి కరోనా బారినపడడంతో తొలుత పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి టెక్కలి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి శ్రీకాకుళంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స చేసే సమయంలో బంగారు గొలుసు, ఉంగరం ఆసుపత్రి సిబ్బంది తీసుకున్నట్టు తన తల్లి ఫోన్లో చెప్పారని జయ తెలిపారు. సోమవారం ఆమె మృతి చెందినట్టు ఆస్పత్రి నుంచి జయకు సమాచారం వచ్చింది. మంగళవారం మృతదేహాన్ని అప్పగించారు. దహన సంస్కారాలు పూర్తి చేశాక... బంగారు ఆభరణాలు ఇవ్వాలని ఆస్పత్రి సిబ్బందిని జయ అడిగారు. ‘మీ తల్లి బతికే ఉందని, తినడానికి ఏమైనా తీసుకురావాలి’అని వారు చెప్పారని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన తల్లి బంగారాన్ని మాయం చేసేందుకే ఇలా చెబుతున్నారంటూ ఆమె సందేహం వ్యక్తం చేశారు. కరోనా సోకితే ఇంటి వద్ద మందులు వేసుకొ ని బతకాలని, ఆస్పత్రికి మాత్రం వెళ్లవద్దని ఆమె సెల్ఫీ వీడియోలో చెప్పారు.