పీసీబీకి ఏసీసీ ఝలక్.. గంగూలీకే మద్దతు

ABN , First Publish Date - 2020-07-10T01:51:48+05:30 IST

అనుకున్నట్లుగానే ఆసియా కప్-2020 వాయిదా పడింది. ప్రస్తుత కరోనా కాలంలో టోర్నీ నిర్వహించలేమని ఆసియా క్రికెట్ కౌన్సిల్ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏసీసీ ఒక...

పీసీబీకి ఏసీసీ ఝలక్.. గంగూలీకే మద్దతు

దుబాయ్: అనుకున్నట్లుగానే ఆసియా కప్-2020 వాయిదా పడింది. ప్రస్తుత కరోనా కాలంలో టోర్నీ నిర్వహించలేమని ఆసియా క్రికెట్ కౌన్సిల్ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏసీసీ ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. టోర్నీ నిర్వహణ అనుకూలతలపై చర్చించేందుకు తమ కార్యనిర్వాహక బోర్డు అనేకసార్లు సమావేశమైంది. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులపై క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరులో నిర్వహించేందుకు అనేక అడ్డంకులు ఉన్నట్లు దృష్టికి వచ్చాయి. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడంపై ఉన్న ప్రయాణ నియంత్రణలు, క్వారంటైన్ నియమాలు వంటి వాటిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఆటగాళ్లు, జట్టు నిర్వహణ సిబ్బంది, అభిమానుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండడంతో టోర్నీని వాయిదా వేసినట్లు ఏసీసీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సరైన రక్షణ చర్యలను పాటిస్తూ 2021లో టోర్నీని నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంది. 2021లో కూడా జూన్‌ నెలలో టోర్నీ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది టోర్నీ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉందని, అయితే 2021లో జరిగే టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం వహిస్తుందని, ఆ తరువాత 2022లో జరిగే టోర్నీ పాకిస్తాన్‌లో జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది.


ఇదిలా ఉంటే బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ బుధవారం దీనిపై మాట్లాడుతూ, టోర్నీ రద్దయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దానిపై పీసీబీ మీడియా డైరెక్టర్ సమిఉల్ హసన్ ఈ రోజు ఉదయం మండిపడ్డారు. ఆసియా కప్ టోర్నీ రద్దయినట్లు ప్రకటించే అర్హత గంగూలీకి లేదని, ఏసీసీ మాత్రమే ప్రకటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హసన్ ఈ ప్రకటన చేసిన 12 గంటలు కూడా గడవక ముందే ఏసీసీ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2020-07-10T01:51:48+05:30 IST