సీల్డ్ కవర్లకే ప్రభుత్వం పరిమితం: అశోక్ గజపతిరాజు
ABN , First Publish Date - 2021-08-11T01:05:59+05:30 IST
సీల్డ్ కవర్లకే ప్రభుత్వం పరిమితం: అశోక్ గజపతిరాజు
విజయనగరం: సింహాచలం భూములపై గత రెండేళ్ల నుంచి విచారణ చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం సీల్డ్ కవర్లకే పరిమితం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. అన్యాక్రాంతమైన ఆ భూముల వివరాలు, సర్వే నంబర్లు ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. రెండేళ్ల పాటు విచారణ నాన్చుతూ...ఇప్పుడు విజిలెన్స్& ఎన్ఫోర్స్మెంట్ విచారణ అంటున్నారని చెప్పారు. సింహాచలం భూముల విషయంలో తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసు రాలేదని తెలిపారు. మాన్సస్ వ్యవహారం కుటుంబ తగాదా అని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు చైర్మన్ నియామకానికి ఎందుకు జీవో జారీ చేసిందన్నారు. రాష్ట్రంలో ఎన్ని కుటుంబ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుందో చెప్పాలన్నారు. హైకోర్టుకు ఎవరైనా వెళ్లొచ్చని, మాన్సస్ అనేది సొంత వ్యవహారం కాదన్నారు. మాన్సస్, దేవాలయ భూములు సొంత ఆస్తులు కాదని స్పష్టం చేశారు. కోర్టులు తప్పబడుతున్నా... ప్రభుత్వం తప్పులు చేయడం మాత్రం మానడం లేదన్నారు.