GPF నగదు మాయంపై ఉద్యోగ సంఘాలు స్పందించాలి: Asokbabu
ABN , First Publish Date - 2022-06-29T19:26:09+05:30 IST
ఉద్యోగులు సొమ్ముతో ప్రభుత్వం ఆటలాడటం సరికాదని ఎమ్మెల్సీ అశోక్బాబు అన్నారు.
అమరావతి (Amaravathi): ఉద్యోగులు సొమ్ముతో ప్రభుత్వం ఆటలాడటం సరికాదని ఎమ్మెల్సీ అశోక్బాబు (Asokbabu) అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అప్పులు తేవడం కోసమే జగన్ ప్రభుత్వం (Jagan Government) తప్పుడు లెక్కలు చూపుతోందని విమర్శించారు. ఉద్యోగుల జీపీఎఫ్ను జగన్ ప్రావిడెంట్ ఫండ్గా మార్చారని, జీపీఎఫ్ నగదును ఉద్యోగులు మాత్రమే తీసుకునే అవకాశం ఉందన్నారు. జీపీఎఫ్ నగదు మాయంపై ఉద్యోగ సంఘాలు స్పందించాలని అశోక్బాబు సూచించారు.
సీఎం జగన్ అప్పులు తేవడానికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని అశోక్బాబు ఆరోపించారు. ఉద్యోగస్తుల జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ని జగన్ ప్రావిడెంట్ ఫండ్గా మార్చేశారన్నారు. ప్రభుత్వం దీనిపై తక్షణం ఒక వైట్ పేపర్ని విడుదల చేయాలని అశోక్బాబు డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90వేల మంది ఉద్యోగులు... వారికి చెందిన రూ.800 కోట్ల జీపీఎఫ్ నిధులు మాయమైపోయాయి! ఉద్యోగులకు తెలియకుండా, వారి సమ్మతి లేకుండానే ప్రభుత్వం ఆ సొమ్మును లాగేసుకుంది. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, కుటుంబ సభ్యుల వైద్య చికిత్స కోసం జీపీఎఫ్ నుంచి అడ్వాన్సు ఇప్పించాలని ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్లో ఉండగా.... ఇప్పుడు వారి ఖాతాలను ఖాళీ చేయడం కలకలం సృష్టిస్తోంది. అకౌంటెంట్ జనరల్ కార్యాలయం(ఏజీ) గత ఆర్థిక సంవత్సరం ఉద్యోగుల జీపీఎఫ్ వార్షిక స్టేట్మెంట్ను వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఆ లావాదేవీలను చూసుకున్న ఉద్యోగులకు అసలు సంగతి తెలిసింది. తమ ఖాతాల నుంచి తమకు తెలియకుండానే సొమ్ము డెబిట్ అయినట్లు తేలింది. డీఏ బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో జూలై 2018, జనవరి 2019 డీఏ బకాయిలను ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి వారికి తెలియకుండానే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది.