Forbes India జాబితాలో ఒడిశాకు చెందిన ఆశా వర్కర్.. ఆమె జీతం కేవలం రూ.4,500లే

ABN , First Publish Date - 2021-11-30T12:38:01+05:30 IST

అంకిత భావంతో పని చేస్తే గుర్తింపనేది తనంటతానే వస్తుందని నిరూపించింది ఒడిశాకు చెందిన ఒక గిరిజన ఆశా వర్కర్. నెలకు కేవలం రూ. 4,500 జీతం తీసుకుంటూ ఆశా వర్కర్‌గా పనిచేసే మాటిల్డా కుల్లుకు ఫోర్బ్స్ ఇండియా డబ్ల్యు-పవర్ 2021 జాబితాలో చోటు దక్కింది...

Forbes India జాబితాలో ఒడిశాకు చెందిన ఆశా వర్కర్.. ఆమె జీతం కేవలం రూ.4,500లే

అంకిత భావంతో పని చేస్తే గుర్తింపనేది తనంటతానే వస్తుందని నిరూపించింది ఒడిశాకు చెందిన ఒక గిరిజన ఆశా వర్కర్. నెలకు కేవలం రూ. 4,500 జీతం తీసుకుంటూ ఆశా వర్కర్‌గా పనిచేసే మాటిల్డా కుల్లుకు ఫోర్బ్స్ ఇండియా డబ్ల్యు-పవర్ 2021 జాబితాలో చోటు  దక్కింది.


ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలోని బరాగావ్ తహసీల్‌లోని గర్గద్‌బహల్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల మటిల్డా కుల్లు అనే మహిళ గత 15 సంవత్సరాల నుండి ఆశా కార్యకర్తగా పని చేస్తున్నారు. మటిల్డా కుల్లుని ఆశా దీదీ అని కూడా పిలుస్తారు. కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మటిల్డా కుల్లు ప్రజలకు కోవిడ్-19 విషయంలో అవగాహన కల్పిస్తున్నారు. కోవిడ్ 19 సోకితే తీసుకోవాల్సిన  చికిత్స, జాగ్రత్తల గురించి ప్రజల్లో మటిల్డా కులు అవగాహన కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించారు.


ఫోర్బ్స్ ఇండియా డబ్ల్యు-పవర్ 2021 జాబితాలో మటిల్డా కుల్లు కాకుండా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య కూడా ఉన్నారు. ఈ ఏడాది జాబితాలో 21 మంది మహిళలు ఉన్నారు. అంతేకాదు  బరాగావ్ తహసీల్‌లోని 964 మంది ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది.


ఆశా వర్కర్‌గా కుల్లు దినచర్య రోజు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది.  తన ఇంటి పనులను పూర్తి  చేసుకుని.. తన ఫ్యామిలీలో నలుగురుకి ఆహారం సిద్ధం చేస్తుంది.  తనకు ఉన్న నాలుగు పశువులను మేపుతుంది.  తన గ్రామం మొత్తాన్ని తన కుటుంబంగా భావిస్తుంది. ఆశా వర్కర్‌గా ఉద్యోగంలో చేరిన మొదట్లో గ్రామస్థులకు  అనారోగ్యం ఏర్పడితే..డాక్టర్ వద్దకు వెళ్లకుండా మంత్రగత్తె వద్దకు వెళ్లడం మటిల్డా కుల్లు గమనించారు. దీంతో ప్రజలలో వైద్యం పట్ల అవగాహన కలిగించడం మొదలు పెట్టారు. ఆమె కృషి ఫలించింది. గ్రామస్తుల్లో మార్పు వచ్చింది. తమకు ఏ విధమైన వ్యాధులు కలిగినా వెంటనే వైద్యుల వద్దకు వెళ్తున్నారు.


కుల్లు ప్రతిరోజూ గ్రామంలో సైకిల్‌పై ఇంటింటికీ తిరుగుతూ ప్రజల నుంచి ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని తెలుసుకుంటారు. దీంతో పాటు నవజాత, కిశోర బాలికలకు వ్యాధి నిరోధక టీకాలు వేయడం,  గర్భణీ స్త్రీల కు  పౌష్టికాహారం తదితర అంశాలపై గ్రామస్థులకు సలహాలు ఇస్తారు.  కోవిడ్-19 మహమ్మారి సమయంలో, మటిల్డా కులు కోవిడ్-19 వ్యాక్సినేషన్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. కోవిడ్ -19 పరీక్షలను నిర్వహించడానికి ఆమె ప్రతిరోజూ 50-60 ఇళ్లను సందర్శించేది.

Updated Date - 2021-11-30T12:38:01+05:30 IST