కూల్చిన స్థలంలోనే మసీదును నిర్మించాలి

ABN , First Publish Date - 2020-07-11T08:53:34+05:30 IST

చివాలయ ప్రాంగణంలో కూల్చిన స్థలంలోనే మసీదును తిరిగి నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు , హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు.

కూల్చిన స్థలంలోనే మసీదును నిర్మించాలి

సీఎం కేసీఆర్‌ ప్రకటనను స్వాగతించిన అసదుద్దీన్‌ ఒవైసీ

హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): సచివాలయ ప్రాంగణంలో కూల్చిన స్థలంలోనే మసీదును తిరిగి నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు , హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు. మసీదు కూల్చివేతపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనను స్వాగతిస్తున్నప్పటికీ అదే స్థలంలో నిర్మిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. మసీదు విధ్వంసానికి బాధ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. సచివాలయ భవనాలను కూల్చివేసే సందర్భంలో దెబ్బతిన్న ఆలయం, మసీదు నిర్మాణాలను ప్రభుత్వం తిరిగి నిర్మిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనను ఒవైసీ స్వాగతించారు. ప్రభుత్వ వ్యయంతో నిర్మించేందుకు అంగీకరించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముస్లిం యునైటెడ్‌ ఫోరం తరఫున త్వరలో ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు.


సచివాలయ భవనాలను కూల్చివేస్తున్న క్రమంలో భవన శిధిలాలు.. మందిరాలు, మసీదుల పైపడి కొంత నష్టం జరిగిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ విచారం వ్యక్తం చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా ఆలయం, మసీదులను మరింత విశాలంగా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఒవైసీ శుక్రవారం ట్వీట్‌ చేశారు. ఈ విషయంలో త్వరలో ఆలయం, మసీదు నిర్వాహకులతో సమావేశమై కార్యచరణ చేపడతామని సీఎం పేర్కొన్నట్లు అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు.

Updated Date - 2020-07-11T08:53:34+05:30 IST