తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత!

ABN , First Publish Date - 2021-11-24T07:03:39+05:30 IST

జిల్లాలోని బోధన్‌ డివిజన్‌లో మొరం మాఫియా పెట్రేగిపోతోంది. అనుమతులు లేకుండానే అడ్డగోలుగా మొరం అక్రమ తవ్వకాలు చేపడుతూ ప్రకృతి సంపదను కొల్లగొడుతోంది.

తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత!

బొందల గడ్డలుగా మారుతున్న సర్కారు భూములు

మొరం అక్రమ తవ్వకాలకు జిల్లా అధికారుల అండదండలు

నిత్యం లక్షలాది రూపాయల ప్రభుత్వాదాయానికి గండి

పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు

చర్యలకు వెనకాడడంపై పలు అనుమానాలు


బోధన్‌ డివిజన్‌లో మొరం అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. కొందరు అధికా రులు కాసులకు కక్కుర్తిపడి అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారు. దీంతో డివిజన్‌లో పరిస్థితి ‘తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత’ అన్న చందంగా మారింది. బోధన్‌ డివిజన్‌లోని వర్ని, ఎడపల్లి, కోటగిరి, చందూర్‌, మోస్రాతో పాటు రుద్రూరు మండలంలోని అక్బర్‌నగర్‌, రాయకూర్‌, సులేమాన్‌నగర్‌ గ్రామ పొలిమేరల్లో యథేచ్ఛగా మొరం అక్రమ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. తవ్విన మొరాన్ని ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు తరలిస్తూ అధిక ధరలకు విక్రయించి అందినకాడికి దండుకుంటున్నారు. ప్రభుత్వ భూములను బొందల గడ్డలుగా మార్చుతున్నారు.


నిజామాబాద్/రుద్రూరు: జిల్లాలోని బోధన్‌ డివిజన్‌లో మొరం మాఫియా పెట్రేగిపోతోంది. అనుమతులు లేకుండానే అడ్డగోలుగా మొరం అక్రమ తవ్వకాలు చేపడుతూ ప్రకృతి సంపదను కొల్లగొడుతోంది. బోధన్‌ డివిజన్‌లోని వర్ని, ఎడ పల్లి, కోటగిరి, చందూర్‌, మోస్రాతో పాటు రుద్రూ రు మండలంలోని అక్బర్‌నగర్‌, రాయకూర్‌, సులే మాన్‌నగర్‌ గ్రామ శివారు ప్రాంతంలో మొరం తవ్వకాలను చేపడుతున్నారు. తవ్విన మొరాన్ని ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్‌, రుద్రూరు, బోధ న్‌ ప్రాంతాలకు నిత్యం మొరం తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. అయితే వ్యాపారులే ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటంతో వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. అక్రమంగా తరలిస్తున్న మొరం టిప్పర్లను మరో వర్గానికి చెందిన దందా నిర్వాహకులు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఇరువురు పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల రాత్రి సమయంలో రుద్రూరు మండలంలోని సులేమాన్‌నగర్‌ గ్రామంలో ఇరువురు మొరం దందా వ్యాపారులు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు.   తమ దందాను అడ్డుకుంటున్నారని ఓ వర్గం.. లేదు మా దందాను అడ్డుకుంటున్నారని మరో వర్గం పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.


పోలీసుల చెంతకు చేరని వైనం..

మండలంలో మొరం అక్రమ దందా నిర్వాహకులు తరచూ ఘర్షణలకు పాల్పడుతుండగా ఈ వివాదాలు మాత్రం పోలీసుల చెంతకు చేరకపో వడం అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల సులేమాన్‌నగర్‌లో ఇరువ్యాపారుల మధ్యతలెత్తిన ఘర్షణ పోలీసుల చెంతకు చేరకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.


పట్టించుకోని యంత్రాంగం..

బోధన్‌ డివిజన్‌లోని రుద్రూరు మండలంలోని అక్బర్‌నగర్‌, రాయకూర్‌, సులేమాన్‌నగర్‌ గ్రామాల్లో యథేచ్ఛగా మొరం అక్రమ దందా కొనసాగుతున్నా అధికార యంత్రాంగం పట్టనట్లు  వ్యవహరిస్తోంది. రెవెన్యూ, మైనింగ్‌, పోలీసు అధికారులు తమకేమి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. 


అధిక ధరలకు విక్రయాలు..

బోధన్‌ డివిజన్‌ ప్రాంతంలో ట్రిప్పు మొరం రూ.3000 కాగా, స్థానికంగా రూ.2500 వరకు విక్రయిస్తున్నారు. ఇలా రోజూ వందల టిప్పుల్లో మొరం తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ భూములను బొందలగడ్డలుగా మార్చుతున్నారు.

Updated Date - 2021-11-24T07:03:39+05:30 IST