మహిషాసురమర్దినిగా..
ABN , First Publish Date - 2022-10-05T04:30:10+05:30 IST
శంభుగిరి కొండలపై వెలసిన వర్గల్ విద్యాధరి క్షేత్రంలో మంగళవారం విద్యాసరస్వతీ అమ్మవారు భక్తులకు మహిషాసురమర్ధినిగా దర్శనమిచ్చారు
వర్గల్, అక్టోబరు 4: శంభుగిరి కొండలపై వెలసిన వర్గల్ విద్యాధరి క్షేత్రంలో మంగళవారం విద్యాసరస్వతీ అమ్మవారు భక్తులకు మహిషాసురమర్ధినిగా దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యాయవరం చంద్రశేఖరవర్మ సిద్ధాంతి నేతృత్వంలో పూజలు చేశారు. అష్టోత్తర శత కలశాలతో సరస్వతీ అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వేడుకలను తిలకించడానికి భక్తులు అధికంగా తరలి వచ్చారు. భక్తులకు ఆలయ కమిటీ భోజన వసతి ఏర్పాటు చేశారు.
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి హరీశ్రావు
వర్గల్ విద్యాధరి క్షేత్రంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి మంత్రి హరీశ్రావు విద్యా సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రశేఖరవర్మ సిద్ధాంతి మంత్రికి అమ్మవారి శేష వస్త్రాలతో ఘనంగా సన్మానించారు. విద్యాధరి క్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాల్లో చివరి రోజు విజయదశమి పర్వదినం, సందర్భంగా బుధవారం విద్యా సరస్వతీ అమ్మవారు విజయ దివ్య దర్శనం, శమీపూజ నిర్వహించనున్నట్లు తెలిపారు.
కొండపాక..
కొండపాక : కొండపాక మండలం మర్పడగ విజయదుర్గాసమేత సంతాన మల్లికార్జునస్వామి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విజయదుర్గామాత భక్తులకు మహిషాసురమర్ధిని దేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నవావరణ హవనం, కుంకుమ పూజ తదితర కార్యక్రమాలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సతీష్, తిరుపతిరెడ్డి, నరసింహారెడ్డి, సుదర్శన్ రెడ్డి, రవీందర్, రాజేంద్రప్రసాద్, బాలరాజు, సురేందర్, మల్లేశం, రాజు పాల్గొన్నారు.