ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో.. కొత్త కోర్సులు లేనట్లే!

ABN , First Publish Date - 2022-08-08T20:58:34+05:30 IST

ఇంజనీరింగ్‌(Engineering)లో ఈ ఏడాది కొత్త కోర్సులు లేనట్టేనని స్పష్టమైంది. గతంలో ఉన్న కోర్సులనే ఈ ఏడాది కూడా కొనసాగించడానికి కాలేజీలు మొగ్గు

ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో.. కొత్త కోర్సులు లేనట్లే!

ఆసక్తి చూపని కాలేజీలు.. పాత కోర్సులతోనే ప్రవేశాలకు సిద్ధం

7,380 సీట్ల రద్దుకు ఏఐసీటీఈ ఆమోదం


హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌(Engineering)లో ఈ ఏడాది కొత్త కోర్సులు లేనట్టేనని స్పష్టమైంది. గతంలో ఉన్న కోర్సులనే ఈ ఏడాది కూడా కొనసాగించడానికి కాలేజీలు మొగ్గు చూపాయి. రెండేళ్ల నుంచి కరోనా కారణంగా విద్య వ్యవస్థ కొంత ఒడిదుడుకులకు గురైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, కొత్త కోర్సుల వైపు వెళ్లకూడదని కాలేజీలు నిర్ణయించుకున్నాయి. దాంతో పాత కోర్సులకే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(All India Council of Technical Education)(ఏఐసీటీఈ) ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2022-23) ఇంజనీరింగ్‌ కోర్సులు, సీట్ల సంఖ్యపై ఏఐసీటీఈ స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది మొత్తం 1,11,147 సీట్లకు ఆమోదం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే.. ఈ సీట్ల సంఖ్య దాదాపు సమానంగానే ఉంది. కాలేజీలు ఈ ఏడాది 7,380 సీట్లను వదులుకున్నాయి. దాంతో ఈ సీట్లను రద్దుచేస్తున్నట్టు ఏఐసీటీఈ ప్రకటించింది. అదేవిధంగా 7,815 సీట్లను పెంచుకోవడానికి ఆమోదం తెలిపింది. సాధారణంగా ప్రతీ సంవత్సరం కొత్త కోర్సులను ప్రవేశపెట్టడానికి కాలేజీలు చొరవ చూపిస్తాయి. ముఖ్యంగా మారుతున్న అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా.. నియామకాలు, ఉపాధి పరంగా డిమాండ్‌ ఉన్న కోర్సులను ప్రవేశపెడతాయి. రెండేళ్ల నుంచి కరోనా కారణంగా పరిస్థితి కొంత భిన్నంగా తయారైంది. దాంతో ఈ విద్యాసంవత్సరంలో కూడా కొత్త కోర్సుల జోలికి వెళ్లలేదు. కాగా, వచ్చే వారం రాష్ట్రంలో ఎంసెట్‌ ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఫలితాల అనంతరం ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. ఈ సారి ఫీజులను పెంచకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే. గత ఏడాది అమలులో ఉన్న ఫీజులే ఈ ఏడాది కూడా వర్తిస్తాయి.



Updated Date - 2022-08-08T20:58:34+05:30 IST