Delhi Excise Policy case : అధికారుల సమయం వృథా : కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-10-07T19:18:33+05:30 IST

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్

Delhi Excise Policy case : అధికారుల సమయం వృథా : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని, కుళ్లు రాజకీయాల కోసం అధికారుల సమయాన్ని వృథా చేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ ఎక్సయిజ్ విధానంలో అక్రమాలపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా శుక్రవారం 35 చోట్ల సోదాలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. 


ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్‌లలో ఈడీ తాజాగా శుక్రవారం సోదాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. మూడు నెలల నుంచి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను గుర్తించేందుకు 500కుపైగా దాడులు జరిగాయన్నారు. 300 మందికిపైగా సీబీఐ, ఈడీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారన్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా వీరు పని చేస్తున్నారన్నారు. ఏమీ జరగలేదు కాబట్టి వారికి ఏమీ దొరకదని చెప్పారు. మురికి రాజకీయాల కోసం ఈ అధికారుల సమయం వృథా అవుతోందని చెప్పారు. ఇలా అయితే దేశం ఎలా ప్రగతి సాధిస్తుందని ప్రశ్నించారు. 


ఢిల్లీ లిక్కర్ పాలసీ, 2021-22లో అక్రమాలు జరిగినట్లు సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మనీశ్ సిసోడియాతోపాటు 15 మంది నిందితులు ఉన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్  (ఎల్‌జీ) ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులో 11 మంది ఎక్సయిజ్ అధికారులను ఎల్‌జీ సస్పెండ్ చేశారు.


Updated Date - 2022-10-07T19:18:33+05:30 IST