Delhi Excise policy: సీబీఐ దర్యాప్తునకు ఎల్జీ ఆదేశాలు.. సిసోడియా పేరు ప్రస్తావన
ABN , First Publish Date - 2022-07-22T21:33:27+05:30 IST
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ నూతన ఎక్సైజ్ విధానంపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ..
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ నూతన ఎక్సైజ్ విధానంపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా బుధవారంనాడు సిఫారసు చేశారు. కొత్త చట్టంలో ఉద్దేశపూర్వకంగా పలు ఉల్లంఘనలు జరిగాయని, విధానపరమైన లోటుపాట్లు వల్ల టెంటర్ల తర్వాత కూడా లిక్కర్ లైసెన్సీలకు అనుచిత లబ్ధి చేకూరుతుందని జూలై 8న చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక చెబుతోందని సక్సేనా కార్యాలయం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
సిసోడియా పేరు ప్రస్తావన...
ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరును లెఫ్టినెంట్ గవర్నర్ నేరుగా ప్రస్తావిస్తూ, చీఫ్ సెక్రటరీ నివేదక ప్రకారం ఉన్నత రాజకీయ స్థాయి వ్యక్తులకు గణనీయమైన ఆర్థిక లబ్ధి చేకూరుతుందని అన్నారు. ప్రైవైటు లిక్కర్ బ్యానర్లకు లబ్ధి చేకూర్చుడమే ఏకైక లక్ష్యంగా నూతన ఎక్సైజ్ పాలసీ ఉందని, ఈ విధానం ద్వారా మామూలు వ్యక్తుల నుంచి మనీష్ సిసోడియా వరకూ లబ్ధి చేకూరుతుందని లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఇన్చార్జిగా ఉన్న మనీష్ సిసోడియా తీసుకున్న, అమలు చేసిన ప్రధాన నిర్ణయాలు, చర్యలు పూర్తిగా నోటిఫైడ్ ఎక్సైజ్ పాలసీ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ను ఉల్లంఘించేలా ఉన్నాయని సక్సేనా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. లిక్కర్ లెసెన్సీలకు సిసోడియా అనుచిత లబ్ధి చేకూర్చడం వల్ల ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతుందన్నారు.
'ఆప్' మండిపాటు...
కాగా, సక్సేనా ఆదేశాలపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. కేంద్ర ఆదేశాల మేరకే ఆయన వ్యవహరిస్తున్నారని, తమ పార్టీకి పెరుగుతున్న జనాదరణను అడ్డుకునేందుకే ఈ ప్రయత్నాలని విమర్శించింది. అరవింద్ కేజ్రీవాల్ పట్ల, ఇటీవల ఆప్ సాధించిన విజయాల పట్ల ప్రధాని మోదీ, ఆయన పార్టీ అసూయతో రగిలిపోతోందని, ఆప్ను నిలువరించేందుకు ఏమి చేయడానికైనా సిద్ధపడుతోందని ఆప్ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. పంజాబ్లో ఆప్ విజయంతో బీజేపీ దిక్కుతోచని స్థితిలో ఉందని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ను నిలువరించేందుకు ఢిల్లీలోనూ 2016 నుంచి బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే ఉందని, ఇప్పుడు మళ్లీ అదే తరహా ప్రయత్నాలు మొదలు పెట్టిందని విమర్శించారు.