పరిస్థితి ఆందోళనకరమే... అయితే లాక్‌డౌన్ ఉండదు: సీఎం

ABN , First Publish Date - 2021-04-11T17:42:46+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మరోమారు...

పరిస్థితి ఆందోళనకరమే... అయితే లాక్‌డౌన్ ఉండదు: సీఎం

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడమే దీనికి నిదర్శనం. ఈ పరిస్థితులు అటు ప్రభుత్వంతో పాటు ఇటు సామాన్యులనూ ఆందోళనకు గురిస్తున్నాయి. తాజాగా కరోనా కట్టడిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సీఎం కేజ్రీవాల్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా ప్రమాదకర స్థాయిలో ఉందని, అయినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. 


అయితే కొన్ని కఠిన ఆంక్షలను విధించాలని నిర్ణయించామన్నారు. ఢిల్లీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 10,732 కరోనా కేసులు నమోదయ్యాయని అన్నారు. కేసుల పెరుగుదలను గుర్తుంచుకుని, కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. తాను లాక్‌డౌన్ వైపు మొగ్గు చూపడం లేదని. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆయా రాష్ట్రాల్లోని ఆసుపత్రులు.... వైద్యం అందించలేని స్థాయికి చేరినపుడే లాక్ డౌన్ విధించాలనన్నారు. కాగా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు ఎత్తివేయాలని కోరుతున్నామన్నారు. తాము రెండు మూడు నెలల్లో ఢిల్లీవాసులందరికీ టీకాలు వేయగలుగుతామన్నారు. 

Updated Date - 2021-04-11T17:42:46+05:30 IST