హామీ నెరవేరుస్తారా.. రాజీనామా చేస్తారా?
ABN , First Publish Date - 2021-01-24T09:23:42+05:30 IST
‘‘ఎన్నికల సమయంలో బాండ్ పేపర్ రాసిచ్చిన విధంగా పసుపు బోర్డు, మద్దతు ధర సాధిస్తారా? రాజీనామా చేస్తారా?’’ అని పసుపు రైతులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను నిలదీశారు. హామీల అమలులో
పసుపు బోర్డు ఏమైంది.. అర్వింద్ను నిలదీసిన రైతులు
స్పైసెస్ బోర్డుతోనే ఎక్కువ ప్రయోజనాలు: అర్వింద్
ఆర్మూర్/కమ్మర్పల్లి, జనవరి 23: ‘‘ఎన్నికల సమయంలో బాండ్ పేపర్ రాసిచ్చిన విధంగా పసుపు బోర్డు, మద్దతు ధర సాధిస్తారా? రాజీనామా చేస్తారా?’’ అని పసుపు రైతులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను నిలదీశారు. హామీల అమలులో విఫలమైనందున పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లిలో శనివారం పసుపు రైతుల సమావేశం జరిగింది.
వాస్తవానికి ఈ సమావేశాన్ని ఎంపీ అర్విందే ఏర్పాటు చేయించారు. సమావేశం ప్రారంభం నుంచే రైతులు హామీ ఎప్పుడు నెరవేరుస్తారని ఎంపీని ప్రశ్నించారు. స్పైసెస్ బోర్డును అంగీకరించబోమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇవ్వాలని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని ఎంపీకి సూటిగా చెప్పారు. ఎంపీ మాట్లాడే సమయంలో కూడా రైతులు అడ్డుతగిలారు. దీంతో పలుమార్లు గందరగోళం ఏర్పడింది. పసుపు బోర్డు కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నందు వల్లే స్పైసెస్ బోర్డును మంజూరు చేశామని ఎంపీ అర్వింద్ తెలిపారు. తెలంగాణకు ఈయేడు రూ.30కోట్లు వచ్చాయని వెల్లడించారు.