ఏపీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా రావడం సంతోషంగా ఉంది: జస్టిస్ అరూప్కుమార్
ABN , First Publish Date - 2021-03-06T22:50:43+05:30 IST
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా రావడం సంతోషంగా ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్కుమార్ అన్నారు.
విజయనగరం: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా రావడం సంతోషంగా ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్కుమార్ అన్నారు. మహిళలు, పిల్లలపై అసభ్యకరమైన నేరాలు అధికమవుతున్నాయని, పోక్సో, మహిళా కోర్టుల ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని జస్టిస్ అరూప్కుమార్ పేర్కొన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణస్వీకారం చేశారు.
చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి 1961 మార్చి 11న అస్సోంలోని జార్హట్లో జన్మించారు. గువాహటి యునివర్సిటీ పరిధిలోని కాటన్ కాలేజీ నుంచి 1981లో డిగ్రీ(ఎకనామిక్స్) పూర్తి చేశారు. 1985లో గువాహటి ప్రభుత్వ లాకాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం ఆగస్టు 16వ తేదీన అస్సోం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రధానంగా సివిల్, క్రిమినల్, రాజ్యంగ, సర్వీస్ అంశాల కేసులు వాదించారు. 2004 డిసెంబరు 21న గౌహతి హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. అదే విధంగా గౌహతి హైకోర్టుకు స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేశారు.