రుణ యాప్ల కేసులో ఒకరి అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-18T23:24:37+05:30 IST
రుణయాప్ల కేసులో బ్యాంకింగేతర సంస్థ సీఈవో
హైదరాబాద్: రుణయాప్ల కేసులో బ్యాంకింగేతర సంస్థ సీఈవో పవిత్ర ప్రదీప్ను ఈడీ అరెస్ట్ చేసింది. కుడోస్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో ప్రదీప్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. 39 ఫిన్టెక్ కంపెనీలకు కుడోస్ సర్వీస్ ప్రొవైడర్గా వ్యవహరించినట్లు గుర్తించారు. కుడోస్ సంస్థ రూ.24 కోట్ల అక్రమ లబ్ధి పొందిందని ఈడీ తెలిపింది. కుడోస్ సహకారంలో 39 కంపెనీలకు రూ.544 కోట్ల లబ్ధి చేకూరిందని ఈడీ పేర్కొంది.
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లోన్స్ యాప్స్ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.1400 కోట్లను చైనా కంపెనీలు విదేశాలకు తరలించినట్లు ఈడీ గుర్తించింది. హాంకాంగ్, సింగపూర్, మారిషన్ దేశాలకు నిధులు బదిలీ అయ్యాయి. నకిలీ ఎయిర్ వే బిల్లులు, సర్టిఫికెట్లతో ప్రభుత్వానికి టోకరా ఇచ్చి, రూ.1400 కోట్లు ఇతర దేశాలకు మళ్లించినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంపై బ్యాంక్ అధికారుల సమాచారంతో సీసీఎస్లో కేసు నమోదు అయ్యింది. లోన్ యాప్స్ కంపెనీలపై ఈడీ ఫిర్యాదు చేసింది. 15సీబీ నకిలీ వే బిల్లులు సృష్టించి నగదు మళ్లించినట్లు గుర్తించారు. ఈడీ ఫిర్యాదుతో సీసీఎస్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.