హత్య కేసులో నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2022-05-27T05:30:00+05:30 IST
తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన స్నేహితుని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఇరువురి నిందితులను పోలీసులు అరెస్టు చేశా రు.
తీసుకున్న డబ్బులు అడిగినందుకే హత్య చేశారు : డీఎస్పీ
కడప(క్రైం), మే 27 : తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన స్నేహితుని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఇరువురి నిందితులను పోలీసులు అరెస్టు చేశా రు. కడప టూటౌన్ పోలీ స్స్టేషన్లో డీఎస్పీ వెంకటశివారెడ్డి, సీఐ హాసం, ఎస్ఐలు తులసీనాగప్రసాద్, రాఘవేంద్రారెడ్డిలతో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. కడప నగరం బెల్లంమండీ వీధికి చెందిన షేక్ అశ్రస్ అలియాస్ అశు ఐచర్ వాహనం డ్రైవర్గా జీవనం సాగిస్తూ... ప్రస్తుతం ఆర్కేనగర్లో నివాసం ఉంటున్నాడు. నఖా్షలోని గోపాలస్వామి గుడి సమీపంలో ఉన్న పెయింటర్ షేక్ యూనస్ అలియాస్ మాలిక్, ఖలీల్నగర్కు చెందిన ఇమ్రాన్ఖాన్తో స్నేహితులుగా ఉంటున్నారు. ఇరువురు ఇమ్రాన్ఖాన్ వద్ద దాదాపు రూ.3 లక్షలు డబ్బులు తీసుకున్నారు.. తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని ఇమ్రాన్ఖాన్ పలుమార్లు అడుగుతుండేవాడు. అయితే ఇరువురు ఇమ్రాన్ దగ్గర తీసుకున్న డబ్బులతో మద్యం తాగి జల్సాగా తిరిగారు. ఈనెల 25న ఇమ్రాన్ఖాన్ నిందితుల వద్దకు వెళ్లి తన చెల్లి పెళ్లికుదిరిందని డబ్బులు ఇవ్వాలంటూ గట్టిగా అడగడంతో గొడవపడ్డారు. రేపటికల్లా డబ్బులు ఇవ్వకపోతే అంతు చూస్తానని ఇమ్రాన్ ఇద్దరిని బెదిరించినట్లు తెలిపారు. దీంతో ఇమ్రాన్ఖాన్ను అడ్డు తొలగిస్తే డబ్బు సమస్య పోతుందని షేక్ అశ్రస్, షేక్ యూన్సలు పథకం పన్నారు. ఈనెల 25వ తేదీ 11.30 గంటలకు ఇద్దరు ఇమ్రాన్ ఇంటికి వెళ్లి డబ్బులు ఇస్తామంటూ చెప్పడంతో ఇమ్రాన్ బైక్పై ముగ్గురు ఖలీల్నగర్ సమీపంలోని కేసీకెనాల్ కట్ట వద్దకు వెళ్లారు. అక్కడ ఇమ్రాన్ఖాన్ డబ్బులు ఇస్తే నేను ఇంటికి పోతానని అడుగుతుండగా.. అశ్రస్ యూనస్కు సైగ చేశాడు. దీంతో యూనస్ అక్కడే ఉన్న రాయి తీసుకొని ఇమ్రాన్ తలపై గట్టిగా కొట్టగా అతను కిందపడిపోయాడు. ముందుగా దాచిపెట్టిన కారంపొడి ఇమ్రాన్ కళ్లల్లో కొట్టి ఇద్దరు కత్తులతో అతనిని విచక్షణా రహితంగా వీపు, మెడపై పొడవడంతో ఇమ్రాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇమ్రాన్ కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి గట్టిగా కేకలు వేయడంతో ఇమ్రాన్ఖాన్ మృతదేహాన్ని నీళ్లలో తోసి అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు టూటౌన్ సీఐ సయ్యద్ హాసం, ఎస్ఐలు తులసీనాగప్రసాద్, రాఘవేంద్రారెడ్డి ప్రత్యేక టీములతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అశ్రస్, యూనస్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఒక పిడిబాకు, మరొక పదునైన స్టీల్ కత్తి, రెండు కారంపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.