పకడ్బందీగా..
ABN , First Publish Date - 2021-08-04T05:26:02+05:30 IST
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 7న పొందూరులో ఆమె పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్, ఎస్పీ అమిత్బర్దర్లు పొందూరులోని ఏఎఫ్కేకే సంఘం, మార్కెట్ కమిటీల్లో ఏర్పాట్లను పరిశీలించారు.
- పొందూరులో కేంద్రమంత్రి పర్యటనకు ఏర్పాట్లు
- కలెక్టర్ లఠ్కర్, ఎస్పీ అమిత్బర్దర్ పరిశీలన
పొందూరు, ఆగస్టు 3 : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 7న పొందూరులో ఆమె పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్, ఎస్పీ అమిత్బర్దర్లు పొందూరులోని ఏఎఫ్కేకే సంఘం, మార్కెట్ కమిటీల్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పొందూరులో నిర్వహించనున్న బహిరంగసభలో మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. చేనేత, ఖాదీ సంస్థలు, చేనేత కార్మికులకు రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేయనున్నారు. న్యూఢిల్లీ నుంచి విశాఖ చేరుకొని రోడ్డుమార్గంలో ఉదయం 10.30 గంటలకు పొందూరు వస్తారు. ఇక్కడ ఏఎఫ్కేకే సంఘంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం పొందూరు సన్నఖాదీ, వడుకు ప్రక్రియలను పరిశీలించి సంఘం ఆవరణలో రూ.36 లక్షలతో నిర్మించనున్న నేత షెడ్లకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో వివిధ బ్యాంకులు ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు’ అని తెలిపారు. కేంద్రమంత్రి పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ఎస్పీ అమిత్బర్దర్ మాట్లాడుతూ.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భద్రత చర్యలపై డీఎస్పీ మహేంద్ర, ఎస్ఐ లక్ష్మణరావులకు సూచనలు చేశారు. వీరితో పాటు ఆర్డీవో ఐ.కిషోర్, డీపీవో బి.రవీంద్ర, పంచాయతీరాజ్ ఈఈ వీరన్నాయుడు, కేవీఐసీ డైరెక్టర్ ఎస్.రఘు, చేనేత జౌళిశాఖ ఏడీ బషీర్, తహసీల్దార్ రామకృష్ణ, బీజేపీ నాయకులు ప్రతాప్, ఉమామహేశ్వరి, ఏఎఫ్కేకే సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్, వెంకటరమణ ఉన్నారు.
ఖాదీని మరింత ప్రోత్సహించాలి
పొందూరు ఖాదీని మరింతగా ప్రొత్సహించాలని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ తెలిపారు. పొందూరులో ఎస్పీతో అమిత్బర్దర్తో కలిసి ఖాదీ వడుకు, నేత ప్రక్రియను పరిశీలించారు. మహిళా వడుకు కార్మికులకు ప్రశంసించారు. చేనేత, ఖాదీ రంగంలో ఆదాయ మార్గాలు చూపి, నేసిన వస్త్రాలకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తే నేటితరం ఈ రంగంలోకి వస్తారని తెలిపారు. ఖాదీ ప్రక్రియలను ఏఎఫ్కేకే సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కలెక్టర్, ఎస్పీకి వివరించారు.