ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2021-10-24T05:07:40+05:30 IST

ఇంటర్మీ డియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న నోడల్‌ అధికారి హృదయరాజు

- జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాలు

- హాజరు కానున్న 4,311 మంది విద్యార్థులు

గద్వాల టౌన్‌/మరికల్‌, అక్టోబరు 23 :  ఇంటర్మీ డియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షలకు 4,311 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రతీ కేంద్రానికి ఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌, మరొక డిపార్ట్‌మెంటల్‌ అధికారితో పాటు సిట్టింగ్‌ స్క్వాడ్‌గా ఇద్దరు అధికా రులను నియమించారు. వారితో పాటు డిప్యూటీ తహసీల్దార్‌, ఒక సీనియర్‌ లెక్చరర్‌, ఒక ఏఎస్‌ఐ, ముగ్గురు సభ్యుల బృందంతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధి కారి ఎం.హృదయ రాజు, కన్వీనర్‌గా ఇద్దరు ప్రిన్సి పాళ్లు పద్మావతి, దేవేందర్‌ రెడ్డి పరీక్షల నిర్వహణా కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ధరూరు, అలంపూరు, గట్టు, మానవపాడు, మల్దకల్‌, అయిజ లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, గద్వాలలోని రెండు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, జ్ఞానప్రభ, కొట్టం మాణిక్యమ్మ, కృష్ణవేణి, సాధన ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీవిద్య ఒకేషనల్‌ కళాశాల, అయిజ పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను శనివారం నోడల్‌ అధికారి ఎం.హృదయ రాజు, కమిటీ సభ్యులు పద్మలత, దేవేందర్‌ రెడ్డి ఇతర సిబ్బందితో కలిసి పరిశీలించారు.


- మల్దకల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చీఫ్‌ సూపరింటెండెంట్‌ నర్సింహులు, డీవో వెంకటదాసు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలను పాటించాలని కోరారు. వాటర్‌బాటిల్‌తో పాటు శానిటైజర్‌ వెంట తెచ్చుకోవడానికి అనుమతి ఉందని తెలిపారు. పరీక్షా కేంద్రాన్ని శానిటైజ్‌ చేసినట్లు పేర్కొన్నా రు. వాక్సిన్‌ వేయించుకున్న వారే ఇన్విజిలేషన్‌ విధు లు నిర్వహిస్తారని తెలిపారు. అనారోగ్యం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.


అన్ని కేంద్రాల్లో పూర్తి శానిటైజేషన్‌ 

జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాలను ఇప్పటికే పూర్తిగా శానిటైజేషన్‌ చేశాం. ప్రతీ కేంద్రం వద్ద తాగునీటి వసతితో పాటు అత్యవసర సేవల కోసం వైద్య సిబ్బందిని నియమించాం. ఉదయం తొమ్మిది గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నాము. గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. 

- ఎం. హృదయరాజు, ఇంటర్మీడియన్‌ నోడల్‌ అధికారి

Updated Date - 2021-10-24T05:07:40+05:30 IST