ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , First Publish Date - 2020-10-31T06:54:28+05:30 IST
ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా ప్రశాంత వాతావరణంలో దుబ్బాక ఉప ఎన్నికను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఎన్నిక అధికారి, సిద్దిపేట కలెక్టరు భారతి హోలికేరి తెలిపారు.
సిద్దిపేట కలెక్టర్ భారతి హోలికేరి
వ్యయ, పోలీసు పరిశీలకులతో సమావేశం
సిద్దిపేట సిటీ, అక్టోబరు 30 : ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా ప్రశాంత వాతావరణంలో దుబ్బాక ఉప ఎన్నికను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఎన్నిక అధికారి, సిద్దిపేట కలెక్టరు భారతి హోలికేరి తెలిపారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలో ఎలక్ట్రిసిటీ అథితిగృహంలో ఎన్నికల పోలీస్ పరిశీలకులు సరోజ్కుమార్ ఠాకూర్, వ్యయ పరిశీలకులు నరేష్ బుందేల్, మనీష్ ద్వివేదితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలింగ్కు చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలకులకు వివరించారు. దుబ్బాక శాసన నియోజవర్గం, నైసర్గిక స్వరూపం, జనాభా, విస్తీర్ణం, ఓటర్లు, పోలింగు కేంద్రాల్లో ఏర్పాట్లు, స్వీప్ కార్యక్రమాల నిర్వహణ తదితర సమాచారాన్ని కలెక్టర్ వివరించారు.
మద్యం, డబ్బు పంపిణీ లాంటి అక్రమాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను, ఏర్పాటు చేసిన బృందాలు, వాటి పని తీరును వివరించారు. ప్రచారం కోసం వెచ్చిస్తున్న ప్రతి పైసాను అభ్యర్థుల ఖాతాలో జమ చేసేందుకు తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్ఠంగా అమలుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పిస్తున్న సదుపాయాలను వివరించారు. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.