వన మహోత్సవం

ABN , First Publish Date - 2022-08-10T05:19:26+05:30 IST

స్వర్ణభారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు

వన మహోత్సవం

  • నేడు ఊరూవాడల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
  • రంగారెడ్డి జిల్లాలో  53,540 మొక్కలు నాటాలని లక్ష్యం
  • మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల్లోనూ కార్యక్రమం


స్వర్ణభారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు వనమహోత్సవాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాతో పాటు వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో  ఊరూవాడల్లో భారీగా మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, ఆగస్టు 9) : దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న  వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం ప్రతి రోజూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం ఉమ్మడి జిల్లాలో వనమహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో నేడు ఊరువాడా ముమ్మరంగా మొక్కలు నాటనున్నారు.  అన్ని  గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ వార్డుల వారీగా మొక్కలు నాటేందుకు  లక్ష్యాలు నిర్ణయించారు.  ప్రతి గ్రామ పంచాయతీ పార్కులు, పాఠశాలలు, ఖాళీ స్థలాలు, అనుమతి పొందిన లేఅవుట్లలో కనీసం 75 మొక్కల చొప్పున నాటనున్నారు. అలాగే మండల కేంద్రాల్లో కూడా 750  మొక్కల చొప్పున నాటనున్నారు. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా బుధవారం 53,540 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. శంషాబాద్‌ మండలంలో అత్యధికంగా 4500 మొక్కలు నాటనున్నారు. కొత్తూరులో అతి తక్కువగా 900 మొక్కలు నాటుతున్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇక్కడ జరిగే సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో కనీసం 750 మొక్కలు నాటాలని నిర్ణయించారు.  మంత్రి సబితారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని గండికోటలో జరిగే వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటనున్నారు. అలాగే మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో కూడా నేడు వనమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దసంఖ్యలో పాల్గొననున్నారు. 

Updated Date - 2022-08-10T05:19:26+05:30 IST