ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి
ABN , First Publish Date - 2021-10-21T06:07:57+05:30 IST
జిల్లాలో ఈ నెల 25 నుంచి నవంబరు 2 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్లాల్
కరీంనగర్ టౌన్, అక్టోబరు 20: జిల్లాలో ఈ నెల 25 నుంచి నవంబరు 2 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పద్మనగర్లోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో సమావేశం నిర్వహించి పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు పరీక్షకు నాలుగు రోజుల ముందే పరీక్షా కేంద్రాలకు వెళ్లి ఏర్పాట్లు సరి చూసుకోవాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. డీఐఈవో టి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ కొవిడ్ నిబంధనల ప్రకారం జిల్లాలో 70 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. హాల్టికెట్స్, కాలేజ్ నామినల్ రోల్స్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. సమాధాన పత్రాలు, ఓఎంఆర్ బాక్స్లు, ఫొటో అటెండెన్స్, తదితర సామగ్రిని పద్మనగర్లోని డీఐఈవో కార్యాలయం నుంచి పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఈసీలు జి జగన్మోహన్రెడ్డి, కె రవీందర్రెడ్డి, శశిధర్శర్మ, హెచ్పీసీ మధుమోహన్, డిస్ర్టిక్ట్ బల్క్ సత్యనారాంజనేయ, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు.