Arpita Mukherjee: ఈడీ చార్జిషీట్లో వెలుగుచూసిన అర్పితాముఖర్జీ లీలలు
ABN , First Publish Date - 2022-09-21T13:35:17+05:30 IST
పశ్చిమ బెంగాల్ విద్యా కుంభకోణంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి....
బిడ్డ దత్తతకు పార్థ,అర్పితాల పత్రాలు...రిలేషన్షిప్పై ప్రశ్నించిన ఈడీ
కోల్కతా(పశ్చిమబెంగాల్):పశ్చిమ బెంగాల్ విద్యా కుంభకోణంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.ఈ స్కాంలో నిందితులైన మాజీ మంత్రి పార్థఛటర్జీ, అర్పితా ముఖర్జీలు(Partha Chatterjee and Arpita Mukherjee) ప్రస్థుతం జైలులో ఉన్నారు.నిందితుల ఇళ్ల నుంచి కోట్లాదిరూపాయల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) తాజాగా చార్జిషీట్ కోర్టులో సమర్పించింది. పార్థఛటర్జీ తన బీమా పత్రాల్లో అర్పితా ముఖర్జీని నామినీగా పేర్కొనడంతోపాటు ఆమెతో ఉన్న సంబంధం(relationship) గురించి ఈడీ అధికారులు ప్రశ్నించారు.
అయితే,తన బీమా పత్రాల్లో నామినీగా(nominee) అర్పితా(Arpita Mukherjee) పేరు పెట్టడం గురించి తనకు ఏమీ తెలియదని మాజీ మంత్రి ఛటర్జీ ఖండించారు. ఇద్దరు నిందితుల ఇళ్లలో ఈడీ జరిపిన సోదాల్లో పలు ముఖ్యమైన పత్రాలు(documents) లభించాయి.ఆయా పత్రాల్లో అర్పితా ముఖర్జీ ఒక బిడ్డను దత్తత(adopt a child) తీసుకోవాలని భావించినట్లు ఈడీ విచారణలో తేలింది.అర్పితా బిడ్డ దత్తతకు తనకు అభ్యంతరం లేదని చెపుతూ మాజీ మంత్రి పార్థఛటర్జీ నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారు.
తన కుటుంబ స్నేహితురాలిగా అర్పితాకు తాను బిడ్డ దత్తతకు నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చానని ఛటర్జీ పేర్కొన్నారు.తాను ప్రజా ప్రతినిధి అయినందున అలాంటి సిఫార్సు లేఖల కోసం చాలా మంది తన వద్దకు వస్తారని పార్థ ఈడీ విచారణలో చెప్పారు.ఉపాధ్యాయుల నియామక స్కాంలో పార్థ, అర్పితాల ప్రమేయం గురించి ఏజెన్సీ వారిని ఈడీ నిరంతరం ప్రశ్నిస్తోంది.మాజీ మంత్రి పార్థఛటర్జీ, అతని సహాయకుడి బెయిల్ పిటిషన్ను ఇటీవల కోల్కత్తా హైకోర్టు తిరస్కరించింది.