ఆరోగ్యమిత్రల ఆందోళన

ABN , First Publish Date - 2022-08-12T05:51:18+05:30 IST

దాదాపు 16 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనాలు, క్యాడర్‌ గుర్తింపు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆందోళనకు దిగారు.

ఆరోగ్యమిత్రల ఆందోళన
గుంటూరులోని ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఆరోగ్యమిత్రలు

కనీస వేతనాలు, క్యాడర్‌ గుర్తింపునకు డిమాండ్‌ 

గుంటూరు(తూర్పు), ఆగస్టు 11: దాదాపు 16 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనాలు, క్యాడర్‌ గుర్తింపు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆందోళనకు దిగారు.  సమస్యలను పరిష్కరించాలంటూ గురువారం గుంటూరు కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ కలాంఅజాద్‌ మాట్లాడుతూ అనుభవం ఉన్న ఆరోగ్యమిత్రలను వాచ్‌మన్లు ఉండే క్యాటగిరి-3 ఉద్యోగులుగా గుర్తించడం దారుణమన్నారు. వైఎస్‌ మానసపుత్రిక అంటూ చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేసిన ఉద్యోగులకు దక్కిన ప్రతిఫలం ఇదా అని ప్రశ్నించారు. ఉద్యోగోన్నతుల్లో బీఎస్సీ నర్సింగ్‌ వారికి ఇచ్చిన ప్రాధాన్యం కూడా తమకు ఇవ్వడం లేదన్నారు. కొవిడ్‌, ఇతర సమయాల్లో చనిపోయిన ఆరోగ్యమిత్రలకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్నారు. సీఎఫ్‌ఎమ్‌ఎస్‌ నమోదు సాకుగా చూపి సంక్షేమ పథకాలు అందకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ డీసీ జయకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో జాకీర్‌, అజీజ్‌, శ్రీనివాసరావు, రవికిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-12T05:51:18+05:30 IST