టీఆర్‌పీ స్కామ్ కేసులో సంచలన ట్విస్ట్.. అర్నాబ్ గోస్వామి వాట్సాప్ సందేశాలు లీక్!

ABN , First Publish Date - 2021-01-16T01:37:05+05:30 IST

టీఆర్‌పీ స్కామ్ కేసులో సంచలన ట్విస్ట్.. అర్నాబ్ గోస్వామి వాట్సాప్ సందేశాలు లీక్!

టీఆర్‌పీ స్కామ్ కేసులో సంచలన ట్విస్ట్.. అర్నాబ్ గోస్వామి వాట్సాప్ సందేశాలు లీక్!

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్‌పీ కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగింది. ముంబై పోలీసులు ఈ కేసును విచారిస్తుండగానే... రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తా సహా పలువురి మధ్య జరిగిన సంభాషణలు లీక్ అయ్యాయి. దాదాపు 500 పేజీలకు పైగా ఉన్న ఈ చాట్ మెసేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇవి ‘‘తిరుగులేని ఆధారాలు’’ అంటూ పలువురూ స్పందిస్తున్నారు. కొన్ని చాట్‌లలో టీఆర్పీకి సంబంధించి అవసరమైతే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి సాయం చేస్తానంటూ అర్నాబ్ గోస్వామి భరోసా ఇచ్చినట్టు కనిపిస్తోంది. మరో చాట్‌లో  ‘‘మంత్రులంతా మనతోనే ఉన్నారు’’ అని ఆయన చెబుతున్నట్టు ఉంది. కండీవలి పోలీస్టేషన్‌లో ఈ కేసు నమోదైనట్టు కనిపిస్తున్న ఈ పీడీఎఫ్ పేజీల్లో... ప్రతి పేజీకి పలువురి సంతకాలు ఉండడం మరో విశేషం.




2019 జూలైలో ప్రారంభమై అదే ఏడాది అక్టోబర్ వరకు ఈ సంభాషణలు ఉన్నాయి. ఇది ఒకటే చాట్ కాదు. ఓ వాల్యూమ్‌ పేజీల్లో హెడింగ్‌లు పెట్టి అర్నాబ్ గోస్వామి, వికాస్ ఐడెమ్, ఆర్‌ఆర్‌పీ గ్రూప్, రోమిల్ రంగారియా తదితరుల మధ్య జరిగిన సంభాషణలు కూడా ఉన్నాయి. కాగా మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాల గురించి మొదలు.. మిగతా చానెళ్లకంటే రిపబ్లిక్ చానెల్ ముందుండేందుకు ఏ విధంగా ఆయా అంశాలను  ప్రసారంచేసిందనే దానివరకు ఈ సంభాషణలు ఉన్నాయి.  కేంద్ర మంత్రులపై బార్క్ మాజీ సీఈవో దాస్‌గుప్తా చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సందేశాల్లో కనిపిస్తున్నాయి. కేంద్రమంత్రి ఒకరిని ‘‘యూజ్‌లెస్’’ అంటూ దాస్‌గుప్తా అభివర్ణించినట్టు ఉంది. మరో సందేశంలో చానెల్ మనుగడకు సంబంధించి గోస్వామి ఉద్ధేశ్యపూర్వకంగా స్పందిస్తూ.. ‘‘మంత్రులంతా మనతోనే ఉన్నారు..’’ అని పేర్కొన్నారు. మిగతా పేజీల్లో ఇంకా ఏమేం సంభాషణలు జరిగాయి వెలుగులోకి రావాల్సి ఉంది.







Updated Date - 2021-01-16T01:37:05+05:30 IST