రఘురామ కేసు విచారణ.. ఆర్మీ ఆస్పత్రి నివేదిక అసంపూర్ణంగా ఉంది: దవే

ABN , First Publish Date - 2021-05-21T21:08:03+05:30 IST

ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే రఘురాయ తరపు న్యాయవాది రోహత్గీ

రఘురామ కేసు విచారణ..  ఆర్మీ ఆస్పత్రి నివేదిక అసంపూర్ణంగా ఉంది: దవే

అమరావతి: ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే రఘురాయ తరపు న్యాయవాది రోహత్గీ, ప్రభుత్వ తరపు న్యాయవాది దవే మధ్య వాదోపవాదాలు జరిగాయి. కేసులో కక్షిదారుడు కాని సీఎం జగన్‌ ప్రస్తావన వద్దని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది దవే వాదించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సహేతుకం కాని వ్యాఖ్యలు చేస్తున్నారని, సీఎంపై ఆరోపణలు చేయాలంటే ఆయన్ను ప్రతివాదిగా చేర్చండి అని దవే పేర్కొన్నారు. ఆర్మీ ఆస్పత్రి నివేదికతో తాము విభేదించమని, ఆస్పత్రిపై తమకు ఎంతో విశ్వాసం ఉందని దవే చెప్పారు. కానీ ఆర్మీ ఆస్పత్రి నివేదిక అసంపూర్ణంగా ఉందని ఆయన తప్పుబట్టారు. ఎక్స్‌-రే, వైద్య నివేదికలు స్పష్టంగా ఉన్నాయి కానీ.. రెండు నివేదికల మధ్య ఏదో జరిగిందనే అనుమానం ఉందన్నారు. గుజరాత్ సొసైటీ కేసు తీర్పు ఆధారంగా ఈ కేసును డిస్మిస్ చేయాలని న్యాయమూర్తిని దవే అభ్యర్థించారు. ఈ కేసులో ఆర్టికల్ 136ని అసంబద్ధంగా ఉపయోగించారని, హైకోర్టులో విచారణ ఇంకా పూర్తికాలేదని దవే తెలిపారు. 



ఒక ఎంపీగా ఆయన మాట్లాడే మాటలకు బలం ఎక్కువగా ఉంటుందని, ఆయన మాటలతో చట్టాన్ని చాలా మంది చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంటుందని దవే పేర్కొన్నారు. కోవిడ్-19 పరిస్థితుల్లో శాంతిభద్రతలను కాపాడడం మరో సవాలుగా మారుతుందని, అందుకే సీనియర్ పోలీస్ ఆఫీసర్ దీనిపై ప్రాథమిక విచారణ జరిపారని తెలిపారు. దాదాపు 45 వీడియోలను పరిశీలించారని, కేవలం విమర్శలకు పరిమితం కాలేదు. తన ఫాలోవర్లను రెచ్చగొట్టి గొడవలు సృష్టించేలా, రెడ్డి, క్రిస్టియన్ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ మాట్లాడారని దవే కోర్టు దృష్టికి తెచ్చారు. కులం, మతం ఆధారంగా సమాజంలో అలజడి సృష్టించేలా రఘురామరాజు ప్రయత్నించారని, ఇవన్నీ 124(ఏ) పరిధిలోకి వచ్చే చర్యలుగా పరిగణించాలని దవే సుప్రీంకోర్టును కోరారు.

Updated Date - 2021-05-21T21:08:03+05:30 IST