ఆకట్టుకున్న విన్యాసాలు
ABN , First Publish Date - 2020-11-29T06:58:50+05:30 IST
భారత్ భూభాగంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు, భూభాగం ఆక్రమణకు ప్రయత్నిస్తున్న శత్రుదేశంపై త్రివిధ దళాలు దాడులు చేసి, శత్రువుల శిబిరాలపై ఆకాశం, జల, భూభాగంపై నుంచి మెరుపుదాడులతో ఆటకట్టించింది.
సర్పవరం జంక్షన్ (కాకినాడ), నవంబరు 28: భారత్ భూభాగంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు, భూభాగం ఆక్రమణకు ప్రయత్నిస్తున్న శత్రుదేశంపై త్రివిధ దళాలు దాడులు చేసి, శత్రువుల శిబిరాలపై ఆకాశం, జల, భూభాగంపై నుంచి మెరుపుదాడులతో ఆటకట్టించింది. భారత దేశ తూర్పు నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ జలస్వ ఐరావత్ యుద్ధనౌకతోపాటు నేవీ, ఆర్మీ సిబ్బంది శత్రుదేశ దురాక్రణ, ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకున్నారు. ఇదంతా నిజం కాదు గానీ, మన త్రివిధ దళాల యుద్ధ విన్యాసాల్లో భాగంగా త్రివిఽధ దళాలకు చెందిన ఉన్నతాధికారు లు ఆదేశాల మేరకు కాకినాడ సముద్ర తీరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఐఎన్ఎస్ జలస్వ నుంచి సిబ్బంది, హెలికాఫ్టర్లు, విమానాలు, యుద్ధట్యాంకర్లు, బంకర్లలో ఆర్మీ సిబ్బంది వెపన్లతో జల, భూఉపరితలం, ఆకాశమార్గాల ద్వారా శత్రువుల శిబిరాలపై ఫిరంగులు, వెపన్లతో దాడులు చేశారు. కాకినాడ సూర్యారావుపేట నేవెల్ ఎన్క్లేవ్ బీచ్లో నేవీ, ఎయిర్ఫోర్స్, ఆర్మీల త్రివిధ దళాలు జలప్రహార్-2020 పేరిట శనివారం యాంపీబీయస్ విన్యాసాలు చేపట్టారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల ఆస్తి, ప్రాణ నష్ట నివారణ, దేశ రక్షణ, భారత భూ భాగం దురాక్రమణకు ఉగ్రవాదుల నిర్మూలన, శత్రువు దేశాలతో యుద్ధ సమయంలో భారత త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు నిర్వహించే విన్యాసాలను నిర్వహించారు. సముద్రంలో నుంచి బోట్లలో వచ్చిన కమోండోలు సివరింగ్ ఆపరేషన్ ద్వారా సమర్థంగా తిప్పికొట్టిన ఆపరేషన్, ఆకాశమార్గాన శత్రువుల శిబిరాలపై హెలికాఫ్టర్ల ద్వారా చేసిన ఎయిర్క్రాఫ్ట్ విన్యాసాలు, నేవీ క్రాస్ డెకింగ్, ఆర్మీ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. జలప్రహార్-2020 విన్యాసాలు 26 నుంచి 28 వరకు బీచ్లో జరగాల్సివుండగా తుఫాను కారణంగా ఒక్కరోజుకే ముగించారు.