కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు : కలెక్టర్
ABN , First Publish Date - 2020-04-09T11:23:23+05:30 IST
కరోనా వైరస్ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. బుధవారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మర్కజ్ నుంచి 76 మంది
ఆదిలాబాద్టౌన్, ఏప్రిల్ 8: కరోనా వైరస్ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. బుధవారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మర్కజ్ నుంచి 76 మంది వచ్చినట్లు గుర్తించి 75 మంది శాంపిల్స్ పంపించగా అందులో 10 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలిందని, 62 మందికి వైరస్ నెగెటివ్గా వచ్చిందని మిగతా ముగ్గురి నివేదికలు రావాల్సి ఉందని తెలిపారు. మర్కజ్ నుంచి వచ్చిన వారిని కలిసిన వారిలో 104 మందిని ప్రైమరీ కాంటాక్ట్ కింద గుర్తించడం జరిగిందని, అందులో 88 మంది శాంపిల్స్ను పంపించగా ఒకరికి పాజిటివ్గా తేలిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 163 మంది శాంపిల్స్ పంపించగా 11 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. 19 మంది శాంపిల్స్ పంపించాల్సి ఉందన్నారు.
ఆదిలాబాద్లో 100, హస్నాపూర్లో 25, నేరడిగొండలో 26 ప్రత్యేక టీమ్ల ద్వారా ఇంటింటి సర్వే చేపడుతున్నామని తెలిపారు. 1430 మంది గల్లీ వారియర్స్లను నియమించడం జరిగిందన్నారు. విజయ డెయిరీ ద్వారా 80 మంది సేల్స్మెన్లతో పాల సరఫరా జరుగుతుందని అలాగే ఇంటింటికి ప్యాకెట్ల ద్వారా కూరగాయల విక్రయం చేస్తున్నట్లు తెలిపారు. సురక్ష పేరుతో కలెక్టరేట్ పరిధిలో 10 వాహనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి మాట్లాడుతూ 19 వార్డుల్లో సామాజిక దూరం పాటిస్తూ బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఏఆర్ఎస్పీ వినోద్కుమార్, ఆర్డీవో సూర్యనారాయణ, డీపీఆర్వో భీంకుమార్ పాల్గొన్నారు.
లాక్డౌన్ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేపడుతున్న లాక్డౌన్ను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. బుధవారం పట్టణంలోని ప్రఽధానచౌక్ల వద్ద పోలీసుల బందోబస్తు, నిత్యావసర సరుకుల కోసం వచ్చిన ప్రజల రద్దీని పరిశీలించారు. కొందరు ఒకే వాహనంపై ఇద్దరు వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ మాట్లాడుతూ అత్యవసరమనుకుంటే తప్ప ఎవరిని కూడా బయటకు వెళ్లేందుకు అనుమతించవద్దని పోలీసులకు సూచించారు. వాహన దారులు రోడ్లపైకి రాకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు.