ట్రైన్ జర్నీలో ఈ కుర్రాడికి షాకింగ్ అనుభవం.. తెల్లవారుజామున 3 గంటలకు ఎవరో పిలిచినట్టు అనిపించి నిద్రలేచి చూస్తే..
ABN , First Publish Date - 2022-01-07T18:42:36+05:30 IST
ముంబై వెళ్తున్న ఆ ట్రైన్ తెల్లవారు ఝామున మూడు గంటలకు సూరత్ దాటింది..
ముంబై వెళ్తున్న ఆ ట్రైన్ తెల్లవారు ఝామున మూడు గంటలకు సూరత్ దాటింది.. కోచ్లో ఉన్న అందరూ నిద్రపోతున్నారు.. కొద్దిసేపటికి కొందరు ఆ కోచ్లోకి ప్రవేశించారు.. పడుక్కున్న అందరినీ నిద్ర లేపారు.. తుపాకులు చూపించి బెదిరించి వారి దగ్గర ఉన్న డబ్బు, బంగారం, మొబైల్ ఫోన్లు దోచుకుని పారిపోయారు.. ఆ సమయంలో రైల్వే సిబ్బంది, రైల్వే పోలీసులు కనబడక పోవడం అనుమానాస్పదంగా మారింది.. రానక్పూర్ ఎక్స్ప్రెస్లోని ఎస్ఈ3 కోచ్లో ఈ నెల ఐదో తేదీన ఈ ఘటన జరిగింది.
ఫల్నాకు చెందిన దిలీప్ చౌధురి అనే వ్యక్తి ముంబై వెళ్లేందుకు అదే కోచ్లో ఈ నెల నాలుగో తేదీన ఎక్కాడు. మంచి నిద్రలో ఉండగా ఎవరో పిలిచినట్టు అనిపిస్తే లేచాడు. నిద్ర లేచి చూస్తే నలుగురు దుండగులు తుపాకీలతో కనిపించారు. జేబులో ఉన్న డబ్బు, మొబైల్ ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో దిలీప్ వెంటనే తన దగ్గరునున్న రూ.15 వేలు, మొబైల్ ఇచ్చేశాడు. అలాగే అదే కోచ్లో ఉన్న ఇతరుల నుంచి కూడా దొంగలు డబ్బు, బంగారం, మొబైల్స్ తీసుకుని పారిపోయారు.
ఆ సమయంలో రైల్వే సిబ్బంది, రైల్వే పోలీసులు కనబడలేదు. ముంబై చేరుకున్నాక ప్రయాణీలకుందరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నుంచి దొంగలు ఏయే వస్తువులు దోచుకున్నారో పోలీసులకు చెప్పారు. తమ దగ్గర నుంచి 10 తులాల బంగారం దొంగిలించారని బెంగళూరుకు చెందిన దంపతులు కంప్లైంట్ చేశారు.