అరియల్లూరు జిల్లాలో భారీ మేరీమాత విగ్రహం
ABN , First Publish Date - 2022-04-30T13:42:11+05:30 IST
అరియలూరు జిల్లా ఇళకుర్చిలో 53 అడుగుల ఎత్తయిన భారీ మేరీమాత విగ్రహం ఏర్పాటైంది. ఈ ప్రాంతంలో 1711 సంవత్సరంలో క్యాథలిక్ మిషనరీ తరఫున కాన్స్టోన్జో
ప్యారీస్(చెన్నై): అరియలూరు జిల్లా ఇళకుర్చిలో 53 అడుగుల ఎత్తయిన భారీ మేరీమాత విగ్రహం ఏర్పాటైంది. ఈ ప్రాంతంలో 1711 సంవత్సరంలో క్యాథలిక్ మిషనరీ తరఫున కాన్స్టోన్జో బెస్సి మేరీమాత మందిరం ఏర్పాటుచేశారు. ప్రాచీనమైన ఈ మందిరానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. 60 ఎకరాల్లో ఉన్న ఆ ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనా మందిరం, కమ్యూనిటీ హాల్, కొలను, ఆస్పత్రి, అనాథాశ్రమం, పాఠశాల, లైబ్రరీ తదితరాలున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో 120 అడుగుల ఎత్తులో రోజరీ పార్క్ ఏర్పాటుచేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. మొదటి లేయర్లో మేరీమాత విగ్రహాలు, రెండవ లేయర్లో మేరీ మాత మహిమలు, మందిర విశిష్టత తెలిపేలా చిత్రాలు, మూడో లేయర్లో బైబిల్ కథలు తెలిపేలా విద్యుద్దీపాలతో ఏర్పాటుచేసిన చిత్రాలు, నాలుగో లేయర్లో ప్రత్యేక ప్రార్థన గది, ఐదో లేయర్ 53 అడుగుల ఎత్తయిన మేరీమాత విగ్రహం ఏర్పాటైంది. భక్తుల సౌకర్యార్ధం 25 వసతి గృహాలు కూడా ఏర్పాటుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.