అర్జెంటీనా టు ఒమన్ వయా కేరళ.. సరిహద్దులు దాటిన ప్రేమ..!

ABN , First Publish Date - 2021-12-10T16:52:01+05:30 IST

ఆమెది అర్జెంటీనా, అతడిది కేరళ.. యాక్సిడెంటల్‌గా ఓ ట్రైన్‌లో కలిశారు. తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు.

అర్జెంటీనా టు ఒమన్ వయా కేరళ.. సరిహద్దులు దాటిన ప్రేమ..!

మస్కట్: ఆమెది అర్జెంటీనా, అతడిది కేరళ.. యాక్సిడెంటల్‌గా ఓ ట్రైన్‌లో కలిశారు. తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. అలా రైలులో మొదలైన వారి ప్రేమకథ చివరకు ఒమన్‌లో పెళ్లితో సుఖాంతమైంది. సినిమాటిక్‌గా సాగిన ఈ లవ్ జర్నీ పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది 2015. అర్జెంటీనాకు చెందిన మైదా మెంటో అనే యువతి బ్యూనస్ ఎయిర్స్‌లోని అర్జెంటీనా నేషనల్ యూనివర్శిటీలో ఫిలాసఫీలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అదే ఏడాది ఓ ఫ్రెండ్‌తో కలిసి భారత పర్యాటనకు వచ్చింది. భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాల్లో ఇద్దరు కలిసి సందర్శన మొదలెట్టారు. కానీ, కొన్ని రోజులకే ఆమె స్నేహితురాలు అనారోగ్యం బారిన పడింది. దాంతో ఆమె వెంటనే స్వదేశానికి వెళ్లిపోయింది. ఇక ఒంటరిగా మిగిలిపోయిన మైదా మాత్రం తన పర్యాటనను అలాగే కొనసాగించింది. 


తోడుగా ఉన్న ఫ్రెండ్ వెళ్లిపోవడంతో మొదట మైదా ఒంటరిగా ఇంట్లోంచి బయటకు వెళ్లడానికి కాస్తా భయపడింది. కానీ, కొన్ని రోజులకు ఒంటరిగా తిరగడం అలవాటైన తర్వాత గూగుల్ సాయంతో ఇండియాలో సురక్షిత ప్రాంతాలను వెతికి మరీ తన సందర్శనను కొనసాగించింది. ఈ క్రమంలో ఆమె కేరళకు చేరుకుంది. ఒకరోజు ఎర్నాకులం నుంచి మంగళూరుకు ఓ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో అందులోని ప్రయాణికులు ఓ విషయం గురించి చర్చించుకోవడం ఆమెను బాగా ఆకర్షించింది. అదే అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాళ్లు మారడోనా, మెస్సి గురించి వారు మాట్లాడుకోవడం. అందులో ఓ యువకుడు ఎంతో ఉత్సాహంగా వారిద్దరికి సంబంధించిన విషయాలను తోటి వారికి వివరించడం.. అది కాస్తా ఫుట్‌బాల్ ఆటకు వీరాభిమాని అయిన మైదాను కట్టి పడేసింది. ఆ యువకుడు మరెవరో కాదు.. జస్సీం బాబు.


అంతే.. మైదా మెల్లగా జస్సీంతో మాటలు కలిపింది. అలా ఇద్దరు తరచూ కలుసుకునే వారు. ఇలా వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయడం కాస్తా ప్రేమగా మారింది. దాంతో వారి లవ్ జర్నీ ఏకంగా నాలుగేళ్లు నడిచింది. చివరగా 2019లో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, అదే ఏడాది చివరిలో కరోనా కల్లోలం మొదలు కావడంతో మైదా, జస్సీం ఇద్దరు కలిసి ఒమన్ వెళ్లిపోయారు. అక్కడ జస్సీం సోదరి ఇంట్లో వారి వివాహం జరిగింది. ఇప్పుడీ దంపతులకు ఇద్దరు పిల్లలు. మస్కట్‌లో మైదా సొంతంగా ఆన్‌లైన్ ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్ బిజినెస్ చేస్తుంటే.. జస్సీం ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. 

Updated Date - 2021-12-10T16:52:01+05:30 IST