ఆస్తి రాయలేదని తాతను హత్య చేసిన మనవడు

ABN , First Publish Date - 2022-07-05T06:10:57+05:30 IST

ఆస్తి కోసం తాతను హత్య చేసిన మనవడిని తాడికొండ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

ఆస్తి రాయలేదని తాతను హత్య చేసిన మనవడు
వివరాలు వెల్లడిస్తున్నన డీఎస్పీ పోతురాజు, సీఐ శ్రీనివాసరావు

తాడికొండ, జూలై 4: ఆస్తి కోసం తాతను హత్య చేసిన మనవడిని తాడికొండ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తుళ్లూరు డీఎస్పీ పోతురాజు మాట్లాడారు. తాడికొండ మండలం నిడుముక్కల గ్రామానికి చెందిన మాదాసు సలోమన్‌(61)ను మనవడు తాడిగిరి లోకేష్‌ ఆస్తికి కోసం జూన్‌ 11వ తేదీ ఆర్ధరాత్రి హత్య చేశాడని తెలిపారు. సలోమన్‌కు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమార్తె మాణిక్యం 20 సంవత్సరం నుంచి భర్తకు దూరంగా ఉంటూ, తన పిల్లలతో కలిసి తండ్రి సలోమన్‌ దగ్గర ఉంటుంది. సలోమన్‌ తన పేరుమీద ఉన్న ఆస్తిని కుమార్తె మాణిక్యం పేరున రాశాడు.  విషయం తెలుసుకున్న మాణిక్యం కుమారుడు తాడిగిరి లోకేష్‌ ఆస్తిని తన పేరు మీద రాయాలని తాతతో గొడవ పడుతున్నాడు. దీంతో జూన్‌ 11వ తేదీ లోకేష్‌ తన స్నేహితుడు కలిసి నిడుముక్కలలోని తాత ఇంటికి వచ్చిన తాతతో గొడవ పడి కంగారు కంగారు వెళ్లిపోయాడు. కొద్ది సేపటికి మృతుని కుమారుడు తండ్రి వద్దకు వెళ్లి చూడగా నోటిల్లో నుంచి నురుగ రావటాన్ని గమనించి 108కు సమాచారం అందించారు. ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపు సలోమన్‌ చనిపోవటంతో 108 సిబ్బంది మృతదేహాన్నికుటుంబ సభ్యులకు అప్పగించారు. మరుసటి రోజు సలోమన్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే సలోమన్‌ మనవడు లోకేష్‌ ఆస్తి కోసం తాతను హత్య చేశాడనే పుకార్లు రావటంతో పాటు, పోలీసుల దృష్టికి విషయం  వెళ్లింది. దీంతో పోలీసులు గుంటూరు జీజీహెచ్‌ వైద్యుల సహయంలో సలోమన్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టులో  చేతులపై కనపడని దెబ్బలు ఉన్నాయని, మెడ కింద ఉన్న ఎముక విరిగిపోయిందని, గొంతునులుమి హత్య చేసినట్లు నిర్ధారించారు. దీంతో లోకేష్‌ను పోలీసులు అదుపులొకి తీసుకొని విచారించగా తానే తాతనే హత్య చేసినట్లు ఒప్పకున్నాడు. కేసు నమోదు చేసి కోర్టుకు హజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌.ఐ మహేష్‌, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-05T06:10:57+05:30 IST