హత్య కేసులో నిందితుడి అరెస్టు
ABN , First Publish Date - 2021-04-13T05:57:59+05:30 IST
ఇటీవల నగరంపాలెం పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీనివాసరావుతోట వేణుగోపాలపురంలో జరిగిన తోట శిరీష (24) హత్య కేసు మలుపుతిరిగింది.
ఎస్ఐపై ఆరోపణలు
విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం
గుంటూరు, ఏప్రిల్ 12: ఇటీవల నగరంపాలెం పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీనివాసరావుతోట వేణుగోపాలపురంలో జరిగిన తోట శిరీష (24) హత్య కేసు మలుపుతిరిగింది. ఆమెను గత నెల 26న ఆమె భర్త తోట తిరుపతిరావు ఆమెను కత్తితో నరికి హతమార్చాడు. ఈ కేసులో పోలీసులు తిరుపతిరావును అరెస్టు చేశారు. సోమవారం నిందితుడు తిరుపతిరావును అరెస్టు చేసి మెజిస్ర్టేటు వద్ద హాజరుపర్చగా రిమాండ్ విధించినట్టు నగరంపాలెం సీఐ మల్లికార్జునరావు తెలిపారు.
కాగా తనపై అత్త, నగరంపాలెం ఎస్ఐ తప్పుడు కేసు నమోదు చేసి వేధించిన మూలంగానే తాను ఈ హత్యకు పాల్పడ్డానని నిందితుడు తిరుపతిరావు మీడియాకు వెల్లడించారు. నిందితుడిని జైలుకు తరలిస్తున్న తరుణంలో హత్యకు దారి తీసిన కారణాలను వివరించాడు. కుమారుడిని కిడ్నాప్ చేశానని, తమ భార్య, అత్తలపై హత్యాయత్నానికి పాల్పడ్డానని, ఇలా అనేక రకాల తప్పుడు కేసులు బనాయించి మానసికంగా హింసించడం వల్లే హత్య చేశానని నిందితుడు వెల్లడించారు. నిందితుడి ఆరోపణలపై ఇప్పటికే పోలీసు శాఖలో కలకలం రేగింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. నిందితుడు వెల్లడించిన అంశాలను నగరంపాలెం పోలీసులు నమోదు చేసి ఎస్పీకి నివేదిక పంపినట్లు తెలిసింది.