ఇంతకీ వారేనా?

ABN , First Publish Date - 2021-09-14T05:35:45+05:30 IST

నంద్యాల ఎన్‌జీవో కాలనీ అంటే వేలాది మంది బ్యాంక్‌ కోచింగ్‌ విద్యార్థులు ఉండే ప్రాంతంగా గుర్తింపు. అక్కడ పేకాట డెన్‌ వ్యవహారం కలకలం రేపుతోంది.

ఇంతకీ వారేనా?

  1. నంద్యాల ఎన్‌జీవో కాలనీలో పేకాట డెన్‌!
  2. ఓ కానిస్టేబుల్‌ అండతోనేనని ఆరోపణలు
  3. ఈనెల 11న దాడి చేసిన పోలీసులు
  4. కానిస్టేబుళ్ల పరారీ వార్తలపై విచారణ


 నంద్యాల, సెప్టెంబరు 13: నంద్యాల ఎన్‌జీవో కాలనీ అంటే వేలాది మంది బ్యాంక్‌ కోచింగ్‌ విద్యార్థులు ఉండే ప్రాంతంగా గుర్తింపు. అక్కడ పేకాట డెన్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈనెల 11న పోలీసులు దాడిచేసి రూ.44,450 నగదు స్వాధీనం చేసుకుని 8మందిని అరెస్టు చేశారు. అయితే పేకాట ఆడుతున్న ముగ్గురు కానిస్టేబుళ్లు పరారైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ గదిని అద్దెకు తీసుకుని పేకాట డెన్‌ ఓ కానిస్టేబుల్‌ అండతోనే నడిపినట్లు విమర్శలు ఉన్నాయి. కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి పేకాటరాయుళ్లను ఇక్కడికి రప్పించి ఆడించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సదరు కానిస్టేబుల్‌ రూ.లక్షలు గడించడంతో పాటు సహచర కానిస్టేబుళ్లను కూడా ఇందులోకి దింపాడన్న ప్రచారం సాగుతోంది. 


ఉన్నతాధికారులు వేటు వేస్తున్నా..


దారితప్పిన వారిపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. వీరివల్ల పోలీసుశాఖకే చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గుట్కా వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయని తేలడంతో ఓ కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. అలాగే ఓ యూట్యూబ్‌ చానల్‌ విలేకరి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోనే తనను సస్పెండ్‌ చేశారని మనుసులో పెట్టుకుని సదరు కానిస్టేబుల్‌ తన తమ్ముడితో కలిసి.. ఆ విలేకరిని హత్య చేశాడు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్‌ను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రెండు నెలల క్రితం పోలీసుల వాట్సాప్‌ గ్రూప్‌లో మట్కా డాన్‌ కూతురు ఉండటం కలకలం రేపింది. దీంతో జిల్లా ఉన్నతాధికారులు వారితో సత్సంబంధాలు ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను, ఓ ఎస్‌ఐని సస్పెండ్‌ చేశారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి కొరడా జులిపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సుదీర్ఘ కాలం తిష్టవేసిన ఏఎస్‌ఐలను, హెడ్‌ కానిస్టేబుళ్లను సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారు. ఎస్పీ ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తూ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం పేకాట వ్యవహారం కలకలం రేపుతోంది. 


విచారిస్తున్నాం

పేకాట డెన్‌పై దాడిలో ముగ్గురు కానిస్టేబుళ్లు పరారయ్యారన్న విషయమై విచారణ చేస్తున్నాం. పరారైంది పోలీసులా.. ఇతరులా? అనేది విచారణ అనంతరం తెలుస్తుంది. రూ.లక్షలు పేకాటలో గెలుచుకున్న కానిస్టేబుల్‌ గురించి మా దృష్టికి రాలేదు. విచారణ చేసి చర్యలు చేపడతాం.


- చిదానందరెడ్డి, డీఎస్పీ, నంద్యాల 

Updated Date - 2021-09-14T05:35:45+05:30 IST