అరకొర నిధులు... ఆగిన పనులు
ABN , First Publish Date - 2022-06-27T05:21:09+05:30 IST
ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న తూప్రాన్ మండలంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి.
మధ్యలోనే నిలిచిన పంచాయతీ భవనాలు
అదనపు నిధులకు ఆర్నెళ్లుగా ఎదురుచూపులు
తూప్రాన్రూరల్, జూన్ 26: ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న తూప్రాన్ మండలంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. గజ్వేల్ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేకంగా ‘గడా’ ఏజెన్సీని ఏర్పాటు చేసి ప్రతియేటా ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నప్పటికీ అరకొర నిధుల మంజూరుతో అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. మండలంలోని వట్టూరు, వెంకటాయపల్లి, కోనాయపల్లి, నాగులపల్లి గ్రామాలకు పంచాయతీ భవనాల నిర్మాణాలకు రూ. 20లక్షల చొప్పున ‘గడా’ నిధులు కేటాయించారు. అయితే నిధులు సరిపోక ఆర్నెళ్లనుంచీ పనులు స్లాబుల వరకు పరిమితమయ్యాయి. చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలో సంబంధిత అధికారులు ఇబ్బంది పెడుతున్నారని సర్పంచులు, కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. అదనపు నిధులు కేటాయింపులు లేక భనవాల పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పనులు నిలిచిపోయి నెలలు గడుస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. వెంకటరత్నాపూర్లో పంచాయతీ భవనాకికి నిధులు మంజూరయిన్పటికీ అక్కడ స్థలం సమస్య ఏర్పడింది. వెంకటాయపల్లిలో యాదవుల కమ్యూనిటీ హాలు,కోనాయపల్లిలో యూత్కం లైబ్రరీ భవనాలు సైతం నిధుల కొరత వల్ల మధ్యలోనే నిలిచిపోయాయి. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో కూడ పలు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. సర్పంచుల పదవీ కాలం మరో 8నెలల్లో పూర్తవుతుంది. ఆలోగా భవనాలు పూర్తయితే తమ హయాంలో పనులు చేశామనే సంతృప్తయినా మిగులుతుందనే ఆశాభావంతో సర్పంచులు ఉన్నారు.