అనుభవలేమితోనే అప్పులప్రదేశ్‌

ABN , First Publish Date - 2021-07-23T09:31:30+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు చెక్‌ మెజర్మెంట్‌, యం బుక్కులు రికార్డు చేసి మూడేళ్లు గడుస్తున్నా ఈనాటికీ అనేకమంది గుత్తేదారులకు...

అనుభవలేమితోనే అప్పులప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు చెక్‌ మెజర్మెంట్‌, యం బుక్కులు రికార్డు చేసి మూడేళ్లు గడుస్తున్నా ఈనాటికీ అనేకమంది గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేదు, ఉపాధి హామీ పథకంలో కూలిపని చేసి కడుపు నింపుకునే పేద కార్మికులకు నగదు చెల్లించడం లేదు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. మూడునెలల క్రితం ధాన్యం అమ్మిన అన్నదాతలు ఖరీఫ్‌ మొదలై ఊడ్పులు ఊడుస్తున్నా ఈనాటికీ డబ్బుల కోసం ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. మరోపక్క రాష్ట్రప్రభుత్వోద్యోగులకు, పింఛనుదారులకు మూడేళ్ల నుంచి చెల్లించవలసిన కరువుభత్యం బకాయిలను మూడు వాయిదాలుగా పోయిన జనవరి నుంచి చెల్లిస్తామన్న హామీ ఇప్పటికీ అమలు కాలేదు. అలాగే గతంలో చెల్లించిన సామాజిక పింఛన్లు, చేయూత, అమ్మఒడి పథకాలను, రేషన్‌ కార్డులను కుదించడానికి పూనుకోవడం అర్హులకు సంక్షేమాన్ని దూరం చేయడమే అవుతుంది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని రాజకీయ విశ్లేషకులతో పాటు, ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా కోడై కూస్తున్నది. ఇటువంటి పరిస్థితులలో సలహాదారులకు, వీగిపోయే కేసుల్ని వాదించే న్యాయవాదులకు, ప్రకటనలకు వందలకోట్ల రూపాయలు అప్పనంగా ముట్టజెప్పడం ఎంతవరకు సబబు? నాడు అగ్రభాగాన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నేడు అప్పులప్రదేశ్‌గా రూపాంతరం చెందడానికి పాలకుల అనుభవ లేమి కారణమని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడులో సాగుతున్న అభివృద్ధిని పాలకులు ఇప్పటికైనా ఆకళింపు చేసుకోవాలి. కేంద్రం నుంచి అధిక నిధులు పొందేందుకు లేఖలతో సరిపుచ్చక అవసరమైతే ప్రతిపక్షాలను కలుపుకుపోవాలి. ముప్పైఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానటున్న జగన్‌ తన పాలనావిధానం మార్చుకోకపోతే ఆయన ఆశ ఊహలకే పరిమితమవుతుందని గుర్తించాలి. 

యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

Updated Date - 2021-07-23T09:31:30+05:30 IST