స్మార్ట్‌సిటీలో అభివృద్ధి పనులకు ఆమోదం

ABN , First Publish Date - 2021-05-11T09:31:53+05:30 IST

స్మార్ట్‌సిటీలో భాగంగా తిరుపతిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులకు కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆమోదం తెలిపారు.

స్మార్ట్‌సిటీలో అభివృద్ధి పనులకు ఆమోదం
వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న గిరీష తదితరులు

ప్రాధాన్య క్రమంలో పూర్తిచేయండి

22వ బోర్డు మీటింగ్‌లో కలెక్టర్‌


తిరుపతి(కొర్లగుంట), మే 10: స్మార్ట్‌సిటీలో భాగంగా తిరుపతిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులకు కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆమోదం తెలిపారు. సోమవారం సాయంత్రం తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 22వ బోర్డు మీటింగ్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్న బోర్డు చైర్మన్‌ అయిన కలెక్టర్‌ మాట్లాడుతూ.. పనులను ప్రాధాన్య క్రమంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. 

ఆమోదం తెలిపిన పనులిలా..

రూ.2కోట్లతో ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ, గార్బేజ్‌ కలెక్షన్‌ కోసం కొత్తబండ్లను కొనుగోలు చేయనున్నారు. రూ.8కోట్లతో గొల్లవానిగుంట, కొరమేనుగుంట, పూలవానిగుంట చెరువుల సుందరీకరణ. వినాయకసాగర్‌ వద్ద మల్టీపర్పస్‌ ఆల్‌, మ్యూజికల్‌ ఫౌంటైన్‌, వాటర్‌ స్ర్కీన్‌, సెంట్రల్‌ ఐలాండ్‌ నిర్మాణం. మంగళం, తూకివాకం, వినాయకసాగర్‌ వద్ద సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నారు. తిరుపతిలోని వైఎస్సార్‌ సమావేశ మందిరం నుంచి బోర్డు ఎండీ, నగరపాలక కమిషనర్‌ గిరీష, జీఎం చంద్రమౌళి, ఎస్‌ఈ మోహన్‌, ఎంఈ చంద్రశేఖర్‌, డీఈ కరుణాకర్‌రెడ్డి, ఎయికాం బాలాజీతోపాటు తమ కార్యాలయాల నుంచి తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, టీటీడీ జేఈవో సదాభార్గవి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-11T09:31:53+05:30 IST