ఆయాగా పనిచేస్తున్న శిరీషనే కార్యకర్తగా నియమించండి
ABN , First Publish Date - 2022-10-02T04:41:04+05:30 IST
ఎం.నిడమలూరులోని ఒక అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న శిరీషనే తెల్లబాడు కేంద్రంలో కార్యకర్తగా నియమించాలని స్థానికులు ఐసీడీఎస్ సూపర్వైజర్ సత్యవతిని కోరారు. జేసీ ఆదేశాల మేరకు శనివారం విచారణకు వచ్చిన ఆమెకు తమ అభిప్రాయం చెప్పడంతోపాటు, వినతిపత్రం కూడా ఇచ్చారు.
ఎం.నిడమలూరు గ్రామస్థుల వినతి
ఎం.నిడమలూరు (టంగుటూరు), అక్టోబరు 1 : ఎం.నిడమలూరులోని ఒక అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న శిరీషనే తెల్లబాడు కేంద్రంలో కార్యకర్తగా నియమించాలని స్థానికులు ఐసీడీఎస్ సూపర్వైజర్ సత్యవతిని కోరారు. జేసీ ఆదేశాల మేరకు శనివారం విచారణకు వచ్చిన ఆమెకు తమ అభిప్రాయం చెప్పడంతోపాటు, వినతిపత్రం కూడా ఇచ్చారు. మండలంలోని ఎం.నిడమలూరు పరిధిలోని తెల్లబాడు (152) కేంద్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త పోస్టు భర్తీ కోసం ఐసీడీఎస్ అధికారులు గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఎం.నిడమలూరు గ్రామంలో అంతర్భాగమైన తెల్లబాడును వేరు చేసి చూపించారు. ఈ పోస్టుకోసం కేవలం తెల్లబాడు వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఆ ప్రాంతానికి చెందిన తొమ్మిది మంది అభ్యర్థులు పోటీపడ్డారు. దీంతో స్థానిక అధికార పార్టీ పెద్దలు జోక్యం చేసుకొని ఈ పోస్టుకు వేలం నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన కలెక్టర్.. సీడీపీవోను విచారణకు ఆదేశించారు. అదేసమయంలో గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం (154)లో ఆయాగా పనిచేస్తున్న శిరీష కార్యకర్త పోస్టుకు అవసరమైన అన్ని అర్హతలు తనకు ఉన్నాయని, తెల్లబాడు కేంద్రంలో ఖాళీగా ఉన్న కార్యకర్త పోస్టులో తనకు అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులను కోరారు. మరోవైపు హైకోర్టును కూడా ఆశ్రయించగా ఆమెకు అవకాశం కల్పించాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. గత సోమవారం స్పందనలో జేసీని కలిసి శిరీష కోర్టు సూచనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జేసీ ఆదేశాలమేకు సూపరైజర్ సత్యవతి శనివారం శిరీష ఆయాగా పనిచేస్తున్న అంగన్వాడీ సెంటర్కు వచ్చి స్ధానికులను విచారించారు. వారంతా శిరీషకే అవకాశం కల్పించాలని కోరారు.