ఫోర్జరీ సంతకాలతో వైసీపీ నేతల దరఖాస్తులు
ABN , First Publish Date - 2020-05-25T11:15:04+05:30 IST
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి వాస్తవ లబ్ధిదారుల ఎంపికకు స్థానిక వైసీపీ నేతలు తిలోదకాలు ఇచ్చారు.
ఎస్పీకి వాట్సప్ ద్వారా సమాచారం
ఆయన ఆదేశాలతో ఎస్ఐ విచారణ
పామూరు, మే 24: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి వాస్తవ లబ్ధిదారుల ఎంపికకు స్థానిక వైసీపీ నేతలు తిలోదకాలు ఇచ్చారు. అనుయాయుల ఆధార్కార్డులు, ఫోన్ నంబర్లు సేకరించి దరఖాస్తులు పూరించి వాటిపై వలంటీర్ల సంతకాలు ఫోర్జరీ చేసి అధికారులకు అందజేశారు. ఈవిషయాన్ని వలంటీర్లు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. మండలంలోని తూర్పు కోడిగుడ్లపాడు పంచాయతీకి సంబంధించి వలంటీర్లుగా తాళ్లూరి సంజయ్, లక్ష్మీవెంకట కుమార్, గడ్డం రోహిణి, ఇస్కనపల్లి మోహినిక, చెనికల భాగ్యమ్మ, సీహెచ్ పద్మావతి పనిచేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా ఇంటి నివేశన స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వారు లబ్ధిదారుల జాబితాను తయారు చేసి గ్రామ సచివాలయాల్లో సమర్పించారు.
ఈ దశలో గ్రామ వైసీపీ నాయకులైన చెనికల శ్రీనివాసులు, తాతపూడి రాములు తమకు అనుకూలమైన వ్యక్తుల వద్ద నుంచి ఆధార్ నెంబర్ తీసుకొని దరఖాస్తుల్లో వలంటీర్ల సంతకాలను ఫోర్జరీ చేసి సచివాలయంలోని వీఆర్వో, కార్యదర్శులకు అందజేశారు. ఈ దరఖాస్తులు ఎవరిచ్చారని వలంటీర్లు అధికారులను అడగ్గా వైసీపీ నేతలు అందించినట్టు తెలపడంతో అవాక్కయ్యారు. ఈ విషయాన్ని ఎస్పీకి వాట్సప్ మెసేజ్ ద్వారా చేరవేశారు. ఫోర్జరీ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్థానిక ఎస్ఐని ఆదేశించారు. స్పందించిన ఎస్ఐ చంద్రశేఖర్ వలంటీర్లను పిలిపించి వారి స్టేట్మెంట్ను నమోదు చేసుకొన్నారు. అలాగే ఫోర్జరీ సంతకాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం విచారణకొచ్చిన ఎస్ఐకి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు.