నూతన ఓటర్ల దరఖాస్తులను పరిశీలించాలి
ABN , First Publish Date - 2022-09-27T06:33:26+05:30 IST
నూతన ఓటర్ల దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాకే ఆమోదించాలని అధికారులకు కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
చండూరు, సెప్టెంబరు 26: నూతన ఓటర్ల దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాకే ఆమోదించాలని అధికారులకు కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఓటరు నమోదులో తప్పులు లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. అనంతరం ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పులు ఏ ప్రాతిపాదికన చేస్తున్నారో నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉప ఎన్నిక నేపథ్యంలో ఉన్నతాధికారుల బసకు ప్రభుత్వ గెస్ట్హౌ్సను పరిశీలించారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందుల లేకుండా, మరమ్మతులు ఏవైనా ఉంటే త్వరితగిన పూర్తిచేయాలని పీఆర్ ఏఈ రమేశ్కు సూచించారు. డివిజన్ పరిధిలోని రైతు వేదికల నిర్మాణాలను పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘మన ఊరు, మన బడి’ కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ గణేష్, ఎంపీడీవో సుధాకర్, మునిసిపల్ కమిషనర్ బి.వెంకట్రాం ఉన్నారు.
ఈజీఎస్ పనులను పారదర్శకంగా నిర్వహించాలి
కనగల్: ఈజీఎస్ పనులను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు. ఈజీఎస్ పనులపై అధికారులతో ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. కేంద్ర బృందం పర్యటన నేపథ్యంలో పనుల వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివా్సరావ్, ఇన్చార్జి ఎంపీడీవో అల్తా్ఫఅహ్మద్, ఎంపీవో ముజీబుద్దీన్, ఏపీవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి
నల్లగొండ టౌన్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని అధికారులకు అదనపు కలెక్టర్ భాస్కర్రావు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. వాటిని ఆయా శాఖల అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజావాణిలో సమస్యలు విన్నవిస్తే పరిష్కారమవుతాయన్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.