అంతటా అదే చర్చ

ABN , First Publish Date - 2022-07-01T05:21:19+05:30 IST

జిల్లాలో అనేక కార్యాలయాల్లో బదిలీలపైనే చర్చ సాగుతోంది. కొత్త జిల్లా అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు డిప్యుటేషన్లపై ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు.

అంతటా అదే చర్చ

 సిఫారసు లేఖలతోనే బదిలీల కోసం దరఖాస్తులు

అనుకూలమైన చోటు కోసం విశ్వ ప్రయత్నాలు

పార్వతీపురం - ఆంధ్రజ్యోతి, జూన్‌ 30 : జిల్లాలో అనేక కార్యాలయాల్లో బదిలీలపైనే చర్చ సాగుతోంది.  కొత్త జిల్లా అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు డిప్యుటేషన్లపై ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ  పనిచేస్తున్నారు.  జడ్పీ పర్యవేక్షణలో ఉన్న ఎంపీడీవో కార్యాలయాల్లో కొన్ని చోట్ల ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు చర్యలు ప్రారంభం కావడంతో బదిలీలపైనే ఉద్యోగులు ఎక్కువగా బదిలీలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. జిల్లాలోని గరుగుబిల్లి, కొమరాడ, పార్వతీపురం, సాలూరు, ఇలా అనేక మండలాల్లో ఎంపీడీవోల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్‌చార్జి అధికారులే ఎంపీడీవోలుగా కొనసాగుతున్నారు. కార్యాలయ ఏవోలు, ఇతర మండలాల ఎంపీడీవోలను ఇన్‌చార్జిలుగా కొనసాగిస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు.  ఇక గ్రామస్థాయిలో కార్యదర్శుల పోస్టులుగా ఖాళీగా ఉన్నాయి. గ్రేడ్‌-1, 2, 3, 4 హోదా కలిగిన కార్యదర్శులను అటూ ఇటుగా సర్దుబాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. జిల్లా పరిధిలో డివిజన్‌, నియోజకవర్గ కేంద్రాల్లోని ఇంజినీరింగ్‌ విభాగాల్లో కూడా బదిలీల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఎంపీడీవో కార్యాలయాల్లో పనిచేసే జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు ఇంజినీరింగ్‌ విభాగాల్లో పనిచేసేందుకు  శ్రద్ధ చూపిస్తున్నారు. ఇటువంటి వారు జిల్లాలోని అనేక మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఉన్నారు. ఇదిలాఉండగా కొంతమంది తహసీల్దార్లు తమకు అనుకూలమైన స్థానం కోసం యత్నిస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు అనేకమంది తమకు కావలసిన చోటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రతి ఉద్యోగి తమకు తెలిసిన నాయకులు, కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతోనే బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. గత నెల 30తో గడువు ముగియడంతో రేపో, మాపో బదిలీలపై కసరత్తు పూర్తి చేసి ఎక్కడ ఎవరికి ఏ స్థానం కల్పించారో స్పష్టమవుతోంది.  

 

Updated Date - 2022-07-01T05:21:19+05:30 IST